రాజమండ్రిపై రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జి అద్దిరిపోయింది. ఒక్కసారిగా వేలాదిమంది కిలోమీటర్లు మేర బ్రిడ్జి మీదకు చేరుకోవటంతో బ్రిడ్జికి ఏమవుతుందో అన్న భయం అందరిలోనూ పెరిగిపోయింది. బ్రిడ్జిపై కనుచూపు మేరలో జన సందోహమే. గోదావరి నదిలో కూడా రెండు వైపులా కిలోమీటర్ల కొద్ది సుమారు 600 పడవులు పార్టీ జెండాలు రెపరెపలాడించాయి. ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకున్నపుడు జరిగింది. అంటే తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ పెట్టిన మొదటి అడుగుతో రికార్డులు బ్రద్దలైంది. గతంలో పాదయాత్ర పేరుతో తూర్పు గోదావరి జిల్లాలోకి ఎవరు వచ్చినా ఈ స్ధాయిలో స్వాగతం కనబడలేదు.
అపూర్వ స్వాగతం
జగన్ రాక కోసం ఉదయం నుండే పార్టీ మద్దతుదారులతో పాటు చుట్టు పక్కల గ్రామాలు ప్రజలు, రాజమండ్రి ప్రజలు బ్రిడ్జిపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో జగన్ బ్రిడ్జిపైకి అడుగుపెట్టేటప్పటికే వేలాదిమంది జనాలు స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిడ్జిపై దాదాపు మూడున్న కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జనాలే జనాలు.
150 గుమ్మడికాయలతో హారతి
బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్ కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టి స్వాగతం పలికారు. జెండాలోని మూడు రంగుల చీరలతో 150 మంది మహిళలు 150 గుమ్మడికాయలతో హారతి ఇచ్చారు. తర్వాత రాజమండ్రిలోని కోటిలింగాల బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభ వరకూ యాత్ర సాగింది.