తన పుట్టిన రోజున తెలుగుదేశంపార్టీ అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేసిన నిరాహార దీక్ష ఇపుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రత్యేకహోదా, విశాఖపట్నం రైల్వేజోన్ డిమాండ్ తో ముత్తంశెట్టి అనాకపల్లిలో దీక్ష చేశారు. పైగా ఈరోజు ఎంపి పుట్టినరోజు కూడా కావటం విశేషం. ఇదే డిమాండ్ తో వైసిపి ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేయటం తర్వాత ఢిల్లీలోని ఏపి భవన్లో నిరాహారదీక్షకు దిగటం అందరికీ తెలిసిందే. సరే, అనారోగ్య కారణాలతో ఢిల్లీ ప్రభుత్వం ఎంపిలను ఆసుపత్రికి తరలించేసిందనుకోండి అది వేరే సంగతి. ఎంపిల రాజీనామాలు, తర్వాత నిరాహార దీక్షలు అప్పట్లో రాష్ట్రంలో ఎంతగా చర్చనీయాంశమైందో.
పార్టీ లైన్ తో సంబంధం లేకుండానే ?
అదే వరసలో తాజాగా టిడిపి ఎంపి కూడా నిరాహారదీక్ష చేయటం గమనార్హం. అయితే, సమస్యంతా ఇక్కడే వచ్చింది అధికార పార్టీలో. నిజానికి ఎంపిల రాజీనామాలు, నిరాహారదీక్షలన్నది పార్టీ స్టాండ్ కానేకాదు. మరి, ఎంపి తన ఇష్టప్రకారం దీక్షకు దిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తెలుగుదేశంపార్టీ అన్న విషయాన్ని మరచిపోకూడదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం అయిన తర్వాతే ఏ కార్యక్రమమైనా. కానీ ఇక్కడ జరిగింది వేరు. పార్టీలో ఏ స్ధాయిలో కూడా చర్చించకుండానే ఎంపి తన ఇష్టానుసారం నిరాహారదీక్షకు కూర్చున్నారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ కు సంబంధించి ఒక్క ముత్తంశెట్టిది ఒకదారి మిగిలిన ఎంపిలది ఒకదారి అన్నట్లైంది. దాంతో మిగిలిన ఎంపిలకు ఇబ్బంది మొదలైంది.
మిగిలిన ఎంపిలపై ఒత్తిడి
మొత్తం టిడిపిలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్ కు సంబంధించి వైసిపి ఎంపిలను అనుసరించింది ఒక్క ముత్తంశెట్టి మాత్రమే అవటంతో మిగిలిన ఎంపిల మీద పరోక్షంగా ఒత్తిడి మొదలైంది. అసలే వాళ్ళ నియోజకవర్గాల్లో టిడిపి ఎంపిలు హోదా, రైల్వేజోన్ లాంటి అంశాలపై దీక్షల లాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ముత్తంశెట్టి దీక్షతో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా పార్టీ క్యాడర్ కావచ్చు లేదా జనాలు కావచ్చు ఆ ఎంపిలను కూడా నిరాహారదీక్షలకు కూర్చోమంటే అప్పుడు సీన్ ఎలాగుంటుందో చూడాలి.
ముత్తంశెట్టి వైసిపిలోకి దూకేస్తారా ?
ఇక్కడో విషయం గమనించాలి. అదేంటంటే, త్వరలో ముత్తంశెట్టి టిడిపిలో నుండి వైసిపిలోకి మారిపోతున్నారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి అనకాపల్లి ఎంపిగా కాకుండా వైసిపి నుండి భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం అటు టిడిపిలోనే కాకుండా ఇటు వైసిపిలో కూడా కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో పార్టీ లైన్ తో సంబంధం లేకుండా ఎంపి నిరాహారదీక్ష చేయటంతో జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే ?
ముత్తంశెట్టిపై ఫిర్యాదు
పుట్టినరోజు నాడు నిరాహారదీక్షకు దిగిన ముత్తంశెట్టిపై పలువురు నేతలు చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. పార్టీ లైన్ తో సంబంధం లేకుండా ముత్తంశెట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటంతో మిగిలిన వాళ్ళకు ఇబ్బందులు వస్తాయని నేతలు వాపోయారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. జరిగిన చర్చను గమనిస్తే పార్టీలో ముత్తంశెట్టి నిరాహారదీక్ష కొత్త తలనొప్పులు తెచ్చినట్లే అర్ధమైపోతోంది.