భారత దేశంలో ఒంటరిగా ఉన్న మహిళ ఎక్కడ కనిపించినా..కొంత మంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అత్యాచారం, హత్యాచారాలు చేస్తూ ఎన్నో దారుణాలకు పాల్పపతుడున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒంటరిగా బస్సెక్కిన మహిళపై కన్నేసిన ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ బస్సులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. యువతి పెద్దగా అరవడంతో బస్టాండ్లో ఉన్న ఇతర ప్రయాణికులు బస్సులోకి వచ్చారు. పరారీలో ఉన్న కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే..భువనేశ్వర్లో నివసిస్తున్న కేంఝర్ డింబో గ్రామానికి చెందిన యువతి సొంతూరుకు వెళ్లేందుకు బర్ముండా బస్టాండ్కు చేరుకుంది. తన గ్రామానికి వెళ్లే బస్సు ఉండటంతో ఎక్కి కూర్చింది. ఆ సమయంలో బస్ లో ఎవ్వరూ లేక పోవడంతో కండక్టర్ తన వికృత రూపాన్ని బయట పెట్టాడు. ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో భయపడిన ఆమె అరవడంతో బస్టాండ్లోనే ఉన్న కొందరు వెంటనే బస్సెక్కారు. దీంతో కండక్టర్ పరారయ్యాడు. అంతే కాదు తన గుట్టు బయట పడుతుందన్న భయంతో ఆ యువతిని ఊరికి చేరే ముందుగానే బలవంతంగా దించేశాడు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో వారొచ్చి ఆమెను తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కండక్టర్ను అరెస్ట్ చేశారు.