రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందెవరు ? ఇపుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసింది మీరంటే మీరే అంటూ ఒకదానిపై మరొక పార్టీ దుమ్మెత్తిపోసుకోవటం చూసిన తర్వాత అందరిలోనూ గందరగోళం మొదలైంది. మొత్తానికి పార్టీ ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరిగింది వాస్తవమే అన్న విషయం స్పష్టమైంది. ఇక అసలు విషయానికి వస్తే, అడ్డుగోలు విభజనతో నష్టపోయిన ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అనేక హామీలు గాలికి కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. విభజన హామీలను అమలు చేస్తామని ఇదే నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు పదే పదే బహిరంగ వేదికలపై ప్రజలకు హామీలిచ్చిన సంగతి అందరూ అప్పట్లో చూసిందే. అప్పట్లో వాళ్ళిచ్చిన హామీలను నిజమని నమ్మి జనాలు వాళ్ళకు ఓట్లు వేశారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. దాంతో రాష్ట్రం అధోగతి పాలైంది.
ప్రత్యేకహోదా అంటే అణిచివేతే
నాలుగేళ్ళపాటు కేంద్రంతో అంటకాగిన చంద్రబాబుకు హటాత్తుగా రాష్ట్రాభివృద్ధి, ఏపికి కేంద్రం మోసం చేసిన సంగతి గుర్తుకొచ్చింది. కుండమార్పిడి పద్దతిలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బిజెపి, టిడిపిలు మంత్రి పదవులను ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, లోటు భర్తీ లాంటివి కేంద్రం ఇవ్వదలుచుకోలేదన్న విషయం మొదట్లోనే అందరికీ అర్ధమైపోయింది. హోదా కోసం, రైల్వేజోన్ కోసం ఉద్యమాలు చేసిన వైసిపి తదితర పార్టీలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. అనేకమందిపై కేసులు పెట్టిన మాటా వాస్తవమే. విభజన చట్టంలో హమీలను అమలు చేయటంలో కేంద్రం దారుణంగా ఫెయిలైంది. అదే సందర్భంలో నాలుగేళ్లపాటు కేంద్రం నుండి ఏపికి రావాల్సినవి రాబట్టటంలో చంద్రబాబు విఫలమైన విషయం అందరికీ అర్ధమైపోయింది.
చంద్రబాబు వైఫల్యాలు
విభజన హామీల అమలులో విఫలమవ్వటమే కాకుండా పాలనాపరంగా కూడా చంద్రబాబు ఫెయిలయ్యారు. అవినీతి బాగా పెరిగిపోయింది. సంక్షేమపథకాలు కూడా అందరికీ అందటం లేదన్న ఆరోపణలు పెరిగిపోయాయి. శాంతిభద్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల ఆధిపత్యం పెరిగిపోవటంతో గ్రామ స్ధాయిలో గొడవలు ఎక్కువైపోయాయి. దాంతో రాజకీయాలతో సంబంధం లేని సామాన్య జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. నాలుగేళ్ళ వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో టిడిపిపై ప్రభావం చూపకతప్పదని చంద్రబాబు గ్రహించారు.
అధికారంలోకి రాకపోతే అంతే సంగతలు
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటమన్నది చంద్రబాబుకు తప్పని పరిస్ధితి. లేకపోతే వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సుంటుందన్న విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకనే పాలనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. అప్పటి నుండి ఏపిని కేంద్రం మోసి చేసిందని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. అంటే తన వైఫల్యాలను కూడా కేంద్రంపై నెట్టేసే ప్లాన్ వేశారు. అందుకు టిడిపికి మద్దతిచ్చే మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు.
ఏపికి మోసం చేసిన బిజెపి
ఇక, బిజెపి విషయం చూస్తే విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంలో ఏపిని మోసం చేసిన మాట వాస్తవమే. తనపై ధ్వేషంతోనే ప్రధానమంత్రి ఏపికి అన్యాయం చేస్తున్నట్లు చంద్రబాబే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. జరుగుతున్నది చూస్తే నిజమే అనిపిస్తోంది. అంటే అటు మోడితో పాటు ఇటు చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారన్నది అర్ధమవుతోంది. ఏపిని మోసం చేయటంలో బిజెపికి ఎంత పాత్రుందో చంద్రబాబుకూ అంతే పాత్రుంది. ఎందుకంటే, నాలుగేళ్ళపాటు కేంద్రం చేసిన మోసాన్ని చంద్రబాబు ఏనాడూ నిలదీయలేదు. పైగా కేంద్రం ఏపికి చాలా సాయం చేసిందని, దేశంలో ఏ రాష్ట్రానికి రానంత సాయం ఏపికి వచ్చిందని ఎన్నోసార్లు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
మోడి, చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్ళేనా ?
ఏపికి మోసం చేసింది కేంద్రమే అని చంద్రబాబు, చంద్రబాబే మోసగాడంటూ నరేంద్రమోడి ఇపుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వారిద్దరి వైఖరి చూస్తుంటే ఇద్దరూ మోసగాళ్ళే అని జనాలకు నిర్ధారణకు వస్తే అది వాళ్ళ తప్పుకాదు. ఎందుకంటే, ఒకళ్ళను మరొకళ్ళు మోసం చేసుకోవటం కాదు. ఇద్దరూ కలిసి నాలుగేళ్ళపాటు రాష్ట్రాన్ని మోసం చేశారన్న విషయం జనాలకు బాగా అర్దమైంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మోసగాళ్ళకు మళ్ళీ పట్టం కట్టాలా ? లేకపోతే వాళ్ళిద్దరి స్ధానంలో కొత్తవారిని ఎన్నుకోవాలా అన్నది జనాలే నిర్ధారించుకోవాలి.