కేసీఆర్ మొండితనమే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గండిపెడుతుందా..? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాచరిక పోకడతో అమలు చేస్తున్న పథకాలే ఆఖరికి పార్టీ కొంప ముంచుతాయా..? నిత్యం చేపట్టిన అంతర్గత సర్వేలు గులాబీ ఎమ్మెల్యేలకు లాభం చేశాయా..? నష్టం చేశాయా..? సమైక్య పాలనలోనూ ఇంతటి నియంత`త్వ సీఎంను చూడలేదని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎందుకంటున్నాయి..? ఇలా మరెన్నో ప్రశ్నలు సీఎం కేసీఆర్ వ్యవహార శైలితో ఉదయిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా చెప్పిన మాటలకు.. ప్రభుత్వాధినేతగా ఆయన చేస్తున్న పనులకు అస్సలు పొంతనలేదనే వాదన రోజురోజుకూ బలపడుతోంది.
కొన్ని పనులతో ఆయనకు వచ్చిన గుర్తింపు కంటే.. మరికొన్ని పనులతో వచ్చిన వ్యతిరేకతే ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యమే. ముఖ్యమంత్రి అయ్యాక అది మరింతగా పెరిగిందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ తనకు ఎలా తోచితే అలా హామీలు ఇస్తారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆ హామీలే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితులు వచ్చాయి. మాట తప్పితే తల నరుక్కుంటానని అనేక సార్లు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు తెలంగాణకు తొలి సీఎంను దళితుడిని చేస్తానని ఆయన ప్రకటించారు.
కానీ, ఆయనే సీఎంగా బాధ్యతలు చేపట్టి, ఉప ముఖ్యమంత్రి పదవులు దళితులకొకటి, ముస్లిం మైనారిటీలకొకటి ఇచ్చారు. ఇప్పుడీ అంశాన్నితెలంగాణలో దళితవర్గాలు ప్రజల్లోని బలంగా తీసుకెళ్తున్నాయి. ఇటీవల వరంగల్లులో నిర్వహించిన దళితసింహగర్జన సభలో కూడా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమారి కూడా ప్రస్తావించారు. దళితులకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని వారు అన్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచీ పనిచేస్తున్నవాళ్లకు గుర్తింపు దక్కడం లేదనే పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్లనే పదవులు కట్టబెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించినవాళ్లకు, కేసీఆర్పై దుమ్మెత్తిపోసిన వారికే మంత్రి పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించారనే వాదన కూడా పార్టీవర్గాల్లో ఉంది. దీంతో పలు జిల్లాల్లో పాత టీఆర్ఎస్ బ్యాచ్ అంతర్గతంగా వేరుకుంపటి నడిపించడం గమనార్హం. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పలువురు నాయకులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో నియోజకవర్గంలో రెండుమూడు గ్రూపులు ఏర్పడ్డాయి.
ఇక అంతేగాకుండా.. ఎన్నికలకు ముందుకు కేసీఆర్ ప్రకటించిన పలు పథకాలు పూర్తిగా విఫలం అయ్యాయని విపక్షాలు అంటున్నాయి. డబుల్బెడ్రూం ఇళ్ల పథకం అమలులో ప్రభుత్వం బాగా వెనకబడింది. ఏదోఒక నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. అలాగే.. దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకానిది కూడా ఇదేపరిస్థితి. ఇక గతంలో కేసీఆర్ చెప్పినట్లుగా ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేయడం గమనార్హం.
కేసీఆర్ వైఖరివల్లే కోదండరాం పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితితో టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంపై కూడా తీవ్రస్తాయిలో విమర్శలు వచ్చాయి. రైతులకు ఉచితంగా రెండు పంటలకు రూ.8వేల పంటపెట్టుబడి అందించడే ఈ పథకం ఉద్దేశం. కానీ.. అమలు తీరే అడ్డదిడ్డంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇందులో కౌలు రైతులను పక్కనపెట్టేశారు. లక్షల మంది ఉన్నకౌలు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మరో విషయం ఏమిటంటే.. ఈ పథకానికి పరిమితిలేకుండా.. ఎకరం ఉన్నరైతుకు రూ.4వేలు వస్తే.. 50ఎకరాలు ఉన్నవారికి ఏకంగా రూ.2లక్షలు రావడం గమనార్హం. రియల్ ఎస్టెట్ భూములకు, సాగులోలేని భూములకు కూడా చెక్కులు అందాయి. సుమారు 70 నుంచి 80శాతం మందికి అందిన మొత్తం.. మిగత ఇరవైశాతానికి అందిన మొత్తానికి సమానంగా ఉందనే టాక్ ఉంది. ఈ పథకంపై సీఎం కేసీఆర్ సర్వే చేపడితే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడి కావడంతో ఆయన కంగుతిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.