విపక్ష పార్టీలతో ఈనెలాఖరున ఢిల్లీలో భారీ స్థాయిలో ఆందోళన.. హస్తినలో పెద్దలకు భారీ షాకిచ్చేందుకు ఆయా పార్టీల నేతలతో మంతనాలు.. మరోపక్క రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన ప్రచారం.. వర్సిటీల విద్యార్థులతో ముఖాముఖి.. దాదాపు ఆరు నెలల్లో 75 సమావేశాలు.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు భవిష్యత్ ప్రణాళిక! ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన భారీ వ్యూహాలు రచించడానికి కారణమేంటనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. స్లో అండ్ స్టడీగా వెళ్లి.. ఆచితూచి అడుగులు వేసే చంద్రబాబు.. ఇంత హడావుడిగా కార్యాచరణ ప్రకటించేందుకు ప్రధాన కారణం ముందస్తు సంకేతాలట. అవును.. ఏపీలో త్వరలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే వార్తలు రావడంతోనే చంద్రబాబు ఇలా కార్యాచరణ మార్చారాని తెలుస్తోంది.
ఏపీలో మళ్లీ `ముందస్తు` రాగం వినిపిస్తోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే.. ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇస్తుండటం ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. ఇటీవల దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. మరోపక్క ప్రధాని మోడీ గ్రాఫ్ కూడా తగ్గుతోందనే చర్చ మొదలైంది. దీంతో బీజేపీ మరింత ఆత్మరక్షణలో పడింది. ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలు వచ్చాక ఎన్నికలకు వెళితే మరింత నష్టం అన్న భావనతో ఉన్న బీజేపీ.. వాటితో పాటు పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అందుకే ముందస్తుకు వెళ్లడానికి మోడీ, అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. బీజేపీతో సన్నిహితంగా ఉండే పార్టీలకు ఈ మేరకు సమాచారం వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కూడా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తన వ్యూహాలు మార్చారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో… ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలకు సూచనలు పంపారు.
వచ్చే ఆరు నెలలకు కార్యాచరణ కూడా ప్రకటించారు. ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో అన్ని విపక్ష పార్టీలో ఢిల్లీలో ఆందోళనకు చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇప్పుడు దీన్ని ముందుకు జరిపారు. అన్ని పార్టీల ఎంపీలతో.. ఈ నెల చివరిలోనే ఢిల్లీలో సభ నిర్వహించాలని ఆదేశించారు. ఢిల్లీ కేంద్రంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం బాధ్యతను ముందుగానే ప్రారంభించారని చెబుతున్నారు. ఎంపీల సమావేశాన్ని నెలాఖరులోనే పెట్టడం వెనుక ఇదే వ్యూహం అంటున్నారు.
వాస్తవానికి చంద్రబాబు సాధారణ ఎన్నికలు సమయానికే జరుగుతాయనుకుని.. ఇప్పటి వరకూ ప్రణాళికలు వేసుకున్నారు. ధర్మపోరాట దీక్షలు.. నెలకొకటి చొప్పున ఎన్నికల వరకూ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతుండటంతో ఆరు నెలల కార్యాచరణ ప్రకటించారు. ఆరు నెలల్లో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లో యూనివర్సిటీల విద్యార్థులతో పాటు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానంటున్నారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారో సమాచారం అంతా తన దగ్గర ఉందని.. తాను తీసుకోబోయే చర్యలకే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. త్వరలోనే మరికొన్ని జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు జరిపి.. చివరి సమావేశాన్ని అమరావతిలో పెట్టాలని యోచిస్తున్నారు. మరి బాబు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో!!