దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే పోలవరం పనులు జరిగాయని బిజెపి అంటోంది. ఒకవైపేమో పోలవరం ప్రాజెక్టు తన డ్రీమ్ ప్రాజెక్టని, పోలవరం నిర్మించటమే తన జీవిత ఆశయంగా చంద్రబాబు చెబుతున్నారు. మంగళవారమే ప్రాజెక్టులోని డయాఫ్రం వాల్ శంకుస్ధాపనను జాతికి అంకితం కూడా చేశారు చంద్రబాబు. నిజానికి పోలవరమే జాతీయ ప్రాజెక్టయినపుడు మళ్ళీ అందులో నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ ను జాతికి అంకితం చేయటమేంటో చంద్రబాబుకే తెలియాలి.
వైఎస్ హయాంలోనే పోలవరం
వాల్ శంకుస్ధాపన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికి 55 శాతం పూర్తయినట్లు చెప్పారు. అంటే 55 శాతం పనులూ చంద్రబాబే చేయలేదు. అందులో కనీసం 45 శాతం పనులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. అంటే గడచిన నాలుగేళ్ళల్లో చంద్రబాబు చేసింది కేవలం 10 శాతం పనులు మాత్రమే. అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పటి వరకూ అయిన పనులన్నీ తానే చేసినట్లు బిల్డప్ ఇస్తుంటారు. సరే టిడిపికి మద్దతిచ్చే మీడియా ఎటూ ఉంది కాబట్టి ఆ మాటలనే ప్రచారం చేస్తుంటాయి.
కమీషన్ల కోసమే చంద్రబాబు
ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి ఎంఎల్సీ మాధవ్ మాట్లాడుతూ పోలవరం పనులు ఏమైనా జరిగాయంటే అవి వైఎస్ హయాంలోనే అంటూ కుండబద్దలు కొట్టటం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు అంగీకరించటానికి ఇష్టపడని విషయాన్ని బిజెపి అంత ఓపెన్ గా ఒప్పకోవటమే కాకుండా చంద్రబాబు గాలి తీసేసింది. కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు బలవంతంగా లాక్కున్నట్లు మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టును లాక్కున్నట్లు ధ్వజమెత్తారు. పోలవరం పనులు జరక్కుండానే జరిగినట్లు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నట్లు మాధవ్ చెప్పారు.