చంద్రబాబునాయుడు రూ 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్దారా ? అవుననే అంటోంది వైసిపి. ఆ పార్టీ నేత లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, చంద్రబాబు రూ. 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. అవినీతితో సంపాదించిన డబ్బంతా కక్కించాల్సిందేనంటూ ధ్వజమెత్తారు. ఇంతకీ చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారనేందుకు వైసిపి దగ్గరున్న ఆధారాలేంటి ? అంటే, కాకిలెక్కలనే చెప్పాలి. ఎందుకంటే, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఇపుడు కూడా చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఎటువంటి అధికార పదవిలో లేని జగన్ ఏ విధంగా లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారో చెప్పమంటూ టిడిపి నేతలు మాట్లాడరు. ఇదే ప్రశ్నకు చంద్రబాబు కూడా సమాధానం చెప్పకుండా దాటవేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు సంపాదించారనే కాకి లెక్కలనే పదే పదే చెబుతున్నారు. ఎలాగూ టిడిపికి మద్దతిచ్చే మీడియా ఉంది కాబట్టి అవే ఆరోపణలను బాగా ప్రచారంలోకి పెట్టాయి.
ఇపుడు అదే పద్దతిని వైసిపి కూడా ఆచరణలో పెడుతోంది. అప్పటికి ఇప్పటికి కాలం మారింది కాబట్టి వైసిపి ఇంకో నాలుగడుగులు ముందుకేసి చంద్రబాబు రూ. 4 లక్షల కోట్లు సంపాదించాడంటూ ఆరోపిస్తోంది. ఎక్కడెక్కడ ఎంత సంపాదించాడో వైసిపి నేతలు ఇపుడు లెక్కలు కూడా చెబుతున్నారనుకోండి అది వేరే సంగతి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇదే ఫిగర్ ను వైసిపి మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నట్లే ఉంది.