వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధైర్యం ఏంటో అర్ధం కావటం లేదు. నిప్పు, పప్పు అదేలేండి చంద్రబాబునాయుడు, లోకేష్ లపై గతంలో తాను చేసిన ఆరోపణలకు విజయసాయి కట్టుబడి ఉన్నట్లు మళ్ళీ చెబుతున్నారు. తిరుమల శ్రీవారి సంపదనను చంద్రబాబు దోచేసుకున్నారంటూ గతంలో ఎంపి చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన శ్రీవారి నగలను చంద్రబాబు విదేశాలకు తరలించేస్తున్నట్లు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు తాజాగా ఎంపి చెబుతున్నారు. తాను చేసిన ఆరోపణలపై విచారణ జరిపితే తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను బయటపెడతానంటూ విజయసాయి చెబుతున్నారు.
నోటీసులను కొట్టిపడేసిన విజయసాయి
తాను చేసిన ఆరోపణలపై నోటీసులు రావటం ఉత్తదే అని కొట్టిపడేశారు. తనకు నోటీసులు ఇచ్చేంత సీన్ టిటిడికి లేదని మండిపడ్డారు. ఏపి దేవాదాయ చట్టంలోని ఓ చాప్టర్ ప్రకారం తనకు నోటీసులు ఇచ్చే అధికారం టిటికి లేదని కాకపోతే సమాచారం కోసం తనను అభ్యర్ధించవచ్చంటూ నోటీసు విషయాన్ని చాలా తేలిగ్గా తీసేశారు. పైగా టిటిడి తనకు నోటీసులు ఇచ్చినట్లు తాను కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఎద్దేవా చేశారు. ఎందుకంటే, తనకింత వరకూ ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. టిటిడి యాక్ట్ తనకు బాగా తెలుసన్నారు. గతంలో తాను టిటిడి బోర్టు సభ్యునిగా పనిచేసిన విషయాన్ని రెడ్డి గుర్తు చేశారు.
పునరావాస కేంద్రంగా టిటిడి
సరే, ఆరోపణు, ప్రత్యారోపణలు సంగతిని పక్కన పెడితే రాజకీయంగా టిటిడి బోర్డు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది వాస్తవం. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావాల్సిన వారిని బోర్డులో నింపేస్తున్నారు. బోర్డు సభ్యులుగా ఉన్న వారి వల్ల టిటిడికి ఏ మేరకు లాభం జరిగిందో శ్రీవారికే తెలియాలి. ప్రతీ ఒక్కరూ తమ స్వలాభం కోసం బోర్డును, తిరుమల ఆలయాన్ని ఉపయోగించుకునే వారిలాగే కనబడుతున్నారు. అందుకే సామాన్య జనాల్లో కూడా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత పెరిగిపోతోంది.
విచారణ జరిపితేనే చంద్రబాబుకు మేలు
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, విజయసాయి కావచ్చు, లేదా అర్చకం రామచంద్ర దీక్షితులు కావచ్చు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదన్నది ప్రశ్న. ఆరోపణలు వచ్చినపుడు అందులో ఉన్న నిజం ఎంత అన్న విషయం జనాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలేంటో బయటపెట్టేంత వరకూ విజయసాయి, రామచంద్రదీక్షితులు చేస్తున్న ఆరోపణలనే వాస్తవాలని అనుకునే వారు కూడా ఉంటారన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి.