వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలుపుకునేందుకు చంద్రబాబునాయుడు సూపర్ ప్లాన్ వేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే చంద్రబాబు ముందుజాగ్రత్త పడుతున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటనే గా మీ సందేహం. అదేలేండి సాధికార మిత్రలను రంగంలోకి దింపటం. సాధికారమిత్రలంటే ఎవరు ? అంటే ప్రభుత్వ ఖర్చుతో తెలుగుదేశంపార్టీకి పనిచేసే వాళ్ళన్నమాట. వాళ్ళంతా దాదాపు టిడిపి వాళ్ళే అన్న విషయంలో సందేహం అవసరం లేదు. పార్టీ క్యాడర్ ను పార్టీ కార్యక్రమాలకు పనిచేయించుకోవాలంటే వాళ్ళకంటూ పెట్టాల్సిన ఖర్చులేవో ఉంటాయి కదా ? ఆ ఖర్చులను ఎవరు భరించాలి ? అందుకే వాళ్ళకు సాధికారమిత్రలంటూ చంద్రబాబు నామకరణం చేసి వారిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారన్న మాట. అంటే అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లన్న సామెతలాగ.
పార్టీ యంత్రాంగంపై నమ్మకం లేదా ?
దేశంలోనే ఏ పార్టీకి లేనంతగా 80 లక్షల మంది సభ్యులు తమ పార్టీకి ఉన్నట్లు తరచూ చంద్రబాబు, లోకేష్ చెబుతుంటారు కదా ? ఇంకా కొత్తగా ఈ మిత్రలెందుకు ? అంటే బహుశా పార్టీ క్యాడర్ పై నమ్మకం లేకేనేమో ? గడచిన నాలుగేళ్ళుగా పార్టీ నేతలకు క్యాడర్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిల మీద నేతలకు కూడా కోపంగా ఉంది. పదవుల్లో ఉన్న వారు తమను గాలికొదిలేశారంటూ పదవులు రానివారు మండిపడుతున్నారు. 2003లో పార్టీ యంత్రాంగంలో కూడా చంద్రబాబుపై ఇదే విధమైన కోపముండేది. పార్టీ ఓడిపోతేకానీ చంద్రబాబుకు బుద్దిరాదంటూ అప్పట్లో పదవులు రానివారితో పాటు సామాన్య క్యాడర్ కూడా కోరుకున్నారు. అందుకనే అప్పటి ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ కూడా పార్టీకి పనిచేయలేదు. అచ్చంగా మళ్ళీ అదేవిధమైన వాతావరణం పార్టీలో ఇపుడు కనిపిస్తోంది. దాంతో చంద్రబాబు ముందుగానే మేల్కొన్నట్లున్నారు. అందుకే ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ ను నమ్ముకోకుండా సోంతంగా మిత్ర వ్యవస్ధను రంగంలోకి దింపుతున్నట్లున్నారు.
4.46 లక్షల సాధికార మిత్రల ఏర్పాటు
రెండేళ్ళ క్రితం రాష్ట్రంలో చంద్రబాబు పల్స్ సర్వే చేయించిన సంగతి గుర్తుందికదా ? అప్పట్లో 1.32 కోట్ల కుటుంబాల వివరాలు ప్రభుత్వం చేతికి అందాయి. అన్ని కుటుంబాలను 35 చొప్పున ఓ క్లస్టర్ గా చంద్రబాబు విభజించారు. ప్రతీ క్లస్టర్ కు ఓ ఇన్చార్జిని నియమించారు. ఆ ఇన్చార్జికే చంద్రబాబు సాధికారమిత్ర అని నామకరణం చేశారు. ఆవిధంగా 1.32 కోట్ల కుటుంబాలకు 4.46 లక్షల సాధికారమిత్రలను నియమించారు. సాధికారమిత్ర పనేంటంటే ప్రతీ కుటుంబంతోనే టచ్ లో ఉండటమే. వాళ్ళ అవసరాలు చూడటం, ఎప్పటికప్పుడు వాళ్ళ వివరాలను ప్రభుత్వానికి అందచేయటం, ప్రభుత్వ కార్యక్రమాలను ఆ కుటుంబాలకు వివరించటమే. ఆ కుటుంబాల్లోని ఓటర్లందరినీ అధికార పార్టీకి అనుకూలంగా మార్చటమన్నదే అంతర్లీనంగా చంద్రబాబు నిర్దేశించిన అజెండా అన్న విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది.
టిడిపికి అనుకూలురే మిత్రలా ?
ఈ మిత్రలకు తరచూ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. శిక్షణ అంటే ప్రభుత్వ ఖర్చులతో పార్టీ ఐడియాలజీకి తగ్గట్లుగా ఎలా పనిచేయాలన్నదే ప్రధాన అజెండా. పైకి చూడటానికి ప్రభుత్వ పని చేస్తున్నట్లే కనిపించినా అంతర్గతంగా మాత్రం 35 కుటుంబాల్లోని వాళ్ళను పార్టీకి అనుగుణంగా మలచటమన్నమాట. మిత్రలుగా ఎంపిక చేయటంలో కూడా చంద్రబాబు సంబంధిత జిల్లా అధికారయంత్రాగానికి ఎటువంటి వారిని ఎంపిక చేయాలో స్పష్టంగా చెప్పారు. టిడిపి ఐడియాలజీకి అనుగుణం ఉన్న వారిని అంటే ఒకే సామాజికవర్గం లేదా టిడిపి సానుభూతిపరులనే ఎంపిక చేస్తారు. వారితో తరచూ చంద్రబాబు టెలికాన్ఫరెన్సుల్లో మాట్లాడటం వల్ల వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ఎలావుంది చంద్రబాబు ఐడియా ?