ఏపీలో పార్టీని బలోపేతం చేస్తూ, టీడీపీని దీటుగా ఎదుర్కొనే సమర్థుడైన నేత కోసం బీజేపీ పెద్దలు చాలా రోజులే వెతికారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి.. ఆ పదవిని భర్తీ చేసేందుకు చాలా టైమే తీసుకున్నారు.. అనేక ఊహాగానాలకు తెరదించుతూ ఆఖరికి కన్నా లక్ష్మీనారాయణను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ సోము వీర్రాజు అలకబూనడం.. అజ్ఞాతంలోకి వెళ్లడం.. రాజీనామాలంటూ ఆయన అనుచరవర్గం హల్చల్ చేయడం.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించడం.. ఆ తర్వాత పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణగడం.. చకచకా జరిగిపోయాయి.
అయితే, ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధిష్టానం తీరుతో ఇంతలోనే చిన్నబోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎగేసి కొంకులు ఇరగ్గొట్టిన చందంగా అధిష్టానం వ్యవహరించడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఎదుర్కొనడం పక్కనబెడితే.. ముందుగా మోడీ-అమిత్షా పోకడను తట్టుకోవడం కష్టంగా మారిందనే ఆలోచనకు కన్నా వచ్చినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఢిల్లీలో ప్రధాని మోడీని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కన్నా లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నట్లు మోడీ తనతో అన్నారని చెప్పారు. తమను చంద్రబాబు ఎందుకు దోషిగా చూపిస్తున్నారు..? ఎందుకు యూటర్న్ తీసుకున్నారని కూడా మోడీ అడిగినట్లు కన్నా పేర్కొన్నారు. బాబును అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చామనీ, అడిగినవన్నీ చేస్తున్నామని మోడీ తనతో అన్నారని ఆయన మీడియ ముందుకు వెల్లడించారు. అయితే ఆ కొద్దిసేపటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో కన్నా లక్ష్మీనారాయణ కంగుతిన్నట్లు సమాచారం.
కడపలో, బయ్యారంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో కన్నా చిన్నబోయినట్లు తెలుస్తోంది. ఏపీకి అన్నీ చేస్తున్నామని చెప్పిన మోడీ.. ఉక్కుకర్మాగారం ఏర్పాటుపై సాధ్యం కాదని ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లడంతో కన్నా అయోమయంలో పడిపోయారట. ఇలా ఏపీకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఇక పార్టీ ఎలా బలోపేతం అవుతుందనీ, తామెలా ప్రజల ముందుకు వెళ్లాలని లోలోపల మదనపడుతున్నట్లు సమాచారం. మరోవైపు మోడీకి ఇచ్చిన వినతిపత్రంలో ఏపీకి ప్రత్యేక హోదా, కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఇప్పటికే టీడీపీ నేతలు ఏకిపారేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అప్పుడే పార్టీ మారితే బాగుండేది కదా.. అన్న ఆలోచనలో కన్నా పడిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత రెండు నెలల కిందట ఆయన బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగిన విషయం విదితమే.