ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువయ్యేందుకు ఎంతో శ్రమిస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎప్పటికప్పుడు ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అంత చేశాం.. ఇంత చేశాం.. అని ఎంత చెప్తున్నా.. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రజలకు మరింత దూరం చేస్తున్నాయి. ఇది కావాలని చేస్తున్నారో లేదో తెలీదు కానీ ఏపీ బీజేపీ నేతలకు మాత్రం అధిష్టానం నిర్ణయాలు అశనిపాతంలాగే మిగిలిపోతున్నాయి.
దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఎంతో శ్రమిస్తోంది. కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా అధికారానికి అర్రులు చాచి అడ్డంగా మునిగిపోయింది. కాంగ్రెస్ – జేడీఎస్ ల వ్యూహాత్మక ఒప్పందంతో బీజేపీ అధికారానికి దూరమైపోయింది. తమిళనాడులో, తెలంగాణలో ఆ పార్టీ అనుకూలురే అధికారంలో ఉండడంతో ఆ రెండు రాష్ట్రాలపై బీజేపీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక కేరళలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఇప్పుడే ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ నే టార్గెట్ గా చేసుకుంది బీజేపీ.
ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ టార్గెట్ గా చేసుకోవడానికి అనేక కారణాలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ నాలుగేళ్లపాటు కలిసి కాపురం చేసింది. అయితే నాలుగేళ్లయినా కూడా రాష్ట్రానికి రావాల్సిన న్యాయం చేయడంలో బీజేపీ తాత్సారం ప్రదర్శిస్తోందని, విభజనచట్టంలోని హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదని ఆరోపిస్తూ టీడీపీ ఎన్డీయే నుంచి బయటికొచ్చేసింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ ఆరోపణలను తట్టుకోలేని బీజేపీ కౌంటర్ ఎటాక్స్ ఇస్తోంది. మిగతా రాష్ట్రాల్లో లాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తథ్యమని చెప్తోంది. ఇందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తామని చెప్తోంది.
అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీల పరమావధి. అందులో ఆయా పార్టీల ఎత్తుగడలను ఏమాత్రం తప్పుబట్టలేం. అయితే విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిందిపోయి కించపరిచేవిధంగా మాట్లాడడం, విభజనచట్టంలోని అంశాలను సైతం పట్టించుకోకుండా విమర్శలు చేస్తుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లోపు విభజనచట్టంలోని రెండు ప్రధాన డిమాండ్లైన విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సాధించగలిగితే పార్టీపై ఉన్న చెడ్డపేరు తొలగిపోతుందని ఇక్కడి బీజేపీ నేతలు ఆశించారు. అయితే వారి ఆశలపైన కూడా నీళ్లు చల్లింది కేంద్రం. కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ద్వారా దానిపైన కూడా ఆశలు చచ్చిపోయాయి.