కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం చంద్రబాబునాయుడుకు షాక్ ఇచ్చింది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటును కేంద్రం పక్కన పెట్టేసిందంటూ నిన్నటి వరకూ చంద్రబాబు మొదలు టిడిపి నేతలందరూ బిజెపిని తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అటువంటి నేపధ్యంలోనే గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చూపించిన ఓ లేఖతో చంద్రబాబకు పెద్ద షాక్ తగిలినట్లైంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం రాసిన లేఖకు రాష్ట్రం రాసినట్లు చెబుతున్న ఓ లేఖను కన్నా మీడియా ముందుంచారు. అందులో కడపలో స్టీలు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు కన్నా వివరించారు.
స్టీల్ ఫ్యాక్టరీ వద్దని చంద్రబాబే చెప్పారు
స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పి తాజాగా కేంద్రంపై నెపాన్ని వేయటంతో చంద్రబాబుపై కన్నా మండిపడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లాంటివి ఏవీ లేదంటూ కన్నా ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్దాలు చెబుతూనే కేంద్రం అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించటం చంద్రబాబుకే చెల్లిందంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమంటూ టిడిపి నేతలు మొదలుపెట్టిన నాటకాలను వెంటనే ఆపేయాలని కూడా ఎద్దేవా చేశారు.
కేంద్రంపై అబద్దాలు ప్రచారం
పునర్విభజన చట్టంలో చెప్పినట్లుగా ఏపి అభివృద్ధికి కేంద్రం కట్టుబడుందని కూడా కన్నా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. అన్నీ అబద్దాలనూ చంద్రబాబే సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, టిడిపి నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలతో బిజెపిపై జనాల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నట్లు మండిపడ్డారు.
మొదలైన ఆందోళనలు
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు ఎలాగున్నా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజంపేటలో వామపక్షాలు, కడపలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకూ ఆందోళన ఆగదని కడప ఎంపి అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.