ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పరిచయం అక్కరలేని నేతలు.. ఒకే మాటగా.. ఒకే బాటగా.. నడిచే నేతలుగా ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.. అయితే.. కొద్దిరోజులుగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైలెంట్గా ఉండడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. రాజకీయాల్లో ప్రతీ అడుగు కలిసి వేసే సోదరులు ఇప్పడు వేరుగా నడుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజగోపాల్రెడ్డి మౌనానికి అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కారణమా లేక.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు జరిగిన ఘటన నేపథ్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ల శాసన సభ్యత్వాన్ని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రద్దు చేయడం.. ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడం.. ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని, వెంటనే వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికీ ప్రభుత్వం వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించలేదు. తమను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని గవర్నర్ నరసింహన్ను వినతిపత్రం ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల స్పీకర్ను కలిసి కూడా తమ సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరారు. ఆఖరికి కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. అయితే ఇందులో ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కనిపించకపోవడం గమనార్హం. వెంకట్రెడ్డి శాసన సభ్యత్వం పునరుద్ధరణ కోసం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నాల్లో రాజగోపాల్రెడ్డి భాగస్వామ్యం కాకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఉత్తమ్తో వెంకట్రెడ్డి సన్నిహితంగా ఉండడంపై రాజగోపాల్రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డిపై రాజగోపాల్రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టికెట్లు అడ్డదిడ్డంగా ఇచ్చారనీ. అందుకే ఎంపీగా తాను ఓడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్రెడ్డి పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.