చంద్రబాబునాయుడు అవినీతిపై వైసిపి ఎంఎల్ఏ, పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గురువారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో రాష్ట్రంలోని బిజెపి నేతలు సమావేశమయ్యారు. అదే సమావేశానికి వైసిపి ఎంఎల్ఏ బుగ్గన కూడా హాజరయ్యారు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో అదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అమిత్ షా తో బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే, అదే సమావేశంలో బుగ్గన కూడా పాల్గొనటంపైనే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు
అయితే, సమావేశం తర్వాత బుగ్గన మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయటానికే వచ్చినట్లు చెప్పారు. ఏ ఏ రంగాల్లో అవినీతి జరుగుతోందో తనకు స్పష్టంగా తెలుసన్నారు. నిజానికి పిఎసి ఛైర్మన్ గా ప్రభుత్వ వ్యవహారాలను దగ్గరగా చూడటానికి మిగిలిన వారికన్నా బుగ్గనకే ఎక్కువ అవకాశం ఉందన్న మాట వాస్తవం. పిఏసి ఛైర్మన్ హోదాలో ప్రతీ శాఖకు చెందిన జమా, ఖర్చులను ఎప్పటికప్పుడు బుగ్గన పరిశీలించటమే కాకుండా అవినీతి జరిగినట్లు తెలియగానే ఎక్కడికక్కడ ఉన్నతాధికారులను నిలదీస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.
అవినీతి జరిగింది నిజమేనా ?
ఎప్పుడైతే టిడిపి, బిజెపిల పొత్తు విచ్చినమైందో అప్పటి నుండి బిజెపి కూడా చంద్రబాబు అవినీతిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. బిజెపి నేతల ఆరోపణల ప్రకారం ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పోలవరం, పట్టిసీమలతో పాటు రాజధాని నిర్మాణంలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది. జరిగిన అవినీతి, విచారణపై చంద్రబాబులో కూడా అనుమానాలు బాగానే ఉన్నట్లుంది. అందుకనే తనను కేంద్రప్రభుత్వం కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని బాహాటంగానే ఎదురుదాడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో చంద్రబాబుపై కేంద్రం విచారణ జరిపించక తప్పదా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఆందొళనలో టిడిపి నేతలు
ఎప్పుడైతే బుగ్గన-అమిత్ షా తో భేటీ అయ్యారన్న విషయం తెలిసిందే అప్పటి నుండి టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు కేంద్రం దృష్టిలో ఎప్పటి నుండో ఉంది. కాకపోతే మొన్నటి వరకూ చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు. మారిన తాజా రాజకీయ పరిస్దితుల్లో కేంద్రంలోని విజిలెన్స్ సంస్ధలు అవినీతిపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దానికితోడు తాజాగా బుగ్గన కూడా ఢిల్లీలో అమిత్ ను కలిసి అవినీతికి సంబంధించిన ఆధారాలను అందించారన్న ప్రచరం మొదలవ్వటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టటం లేదు.