ఏపీ సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకున్న తన ప్రభుత్వ పాలనకు కేవలం బొటాబొటీ మార్కులే దక్కుతున్నాయి. ఇది నిజం! నిష్పాక్షిక సర్వేలో ఇదే తేలిందని ఇటీవల ఆంగ్ల పత్రిక వెల్లడించింది. గత కొన్నాళ్లుగా చంద్రబాబు ప్రజల్లో తన పాలనపై సంతృప్త స్థాయి ఎలా ఉందనే విషయంపై పెద్ద ఎత్తున సర్వే చేయిస్తున్నారు. అయితే, ఈ సర్వేల్లో పాల్గొంటు న్న ఉన్నతాధికారులు, దిగువ స్థాయి అధికారులు.. బాబును మెప్పించేందుకు అంకెల గారడీ చేస్తున్నారని తాజాగా ఈ పత్రిక వెల్లడించింది. సీఎం మెప్పుకోసం.. అధికారులు చెబుతున్న అంకెలనే బాబు వెల్లడిస్తున్నారని, కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి బిన్నంగా ఉందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. ఈ సందర్భంగావారు ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సర్వేలో తమకు పింఛన్లు రాసేందుకు జన్మభూమి కమిటీల వారు ఒప్పుకోవడం లేదని వృద్దులు, వికలాంగులు పెద్ద ఎత్తున తెలిపినట్టు స్పష్టమైంది. ప్రతి పనికీ చేతులు తడపాల్సి వస్తోందని అధికారులు ఎవరూ కూడా అందుబాటులో ఉండడం లేదని, టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులతోనే సరిపెట్టుకుంటున్నారని ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఇక, రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు పడడం లేదని, కంటి ఐరిస్ పనిచేయడం లేదని బియ్యం ఇవ్వడం ఆపేస్తున్న కేసులు భారీగానే ఉన్నట్టు పత్రిక వివరించింది. అదేవి ధంగా రాష్ట్రంలోని దాదాపు 200 గ్రామాల్లో నీటి సౌలభ్యం లేదని, రాజధాని జిల్లా గుంటూరు నడిబొడ్డున కూడా ఇదే పరిస్థితి ఉందని సర్వే వెల్లడించింది.
ఇక, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగవుతున్నా.. ప్రజల్లో వీటిపై అపోహలు తొలగిపోలేదని పేర్కొంది. ఫలితంగా ప్రైవేటు స్కూళ్లనే జనాలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. మరో ముఖ్య విషయం.. పోలీసుల్లోనూ మార్పు రాకపోవడం. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులే నేటికీ ఉండడం, పలు వివాదాల్లో పోలీసులు చిక్కుకోవడం వంటి ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని పత్రిక సర్వేలో తేలింది. మరి పరిస్తితి ఈ రకంగా ఉంటే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎలా ఉంటుందనేది కథనం విశ్లేషణ.
రోజుకో కొత్త పథకం ప్రవేశ పెడుతున్నా.. ఆ పథకం తాలూకు ఫలాలు.. నేటికీ చేరాల్సిన వారికి చేరడం లేదు. అదేసమయంలో ఆయా పథకాలు పొందుతున్నలబ్ధిదారుల్లో దాదాపు అందరూ టీడీపీ వారేనని కూడా సర్వే వెల్లడించింది. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నవారికి ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా చేరడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల సంతృప్త స్థాయి కేవలం 35% మే ఉందని సర్వే స్పష్టం చేయడం బాబులో గుబులు రేపుతోంది.