చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి నేతలు విచిత్రమైన పోకడలు పోతున్నారు. వారు మాత్రమే ఎవరినైనా కలవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. పొరబాటున ఏ రెండు పార్టీలు కలిసినా అంతే సంగతులు. సదరు పార్టీల నేతలు చేయకూడని తప్పేదో చేసేసినట్లు తనకు మద్దతుగా నిలిచే మీడియా ద్వారా ఒకటే ఊదరగొట్టేస్తారు. ఇప్పుడిదంతా ఎందుకంటే .ఢిల్లీలో బిజెపి ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణను, వైసిపి ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కలిసారట. బుగ్గనను ఆకుల బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు తీసుకెళ్లారట. అమిత్ షాను బుగ్గన కలవటంలో నిజమెంతుందో వాళ్ళే చెప్పాలి. ఇక, ఆకుల-బుగ్గన భేటీపైనా టిడిపి మీడియా ఒకటే రొద పెట్టేస్తోంది. టిడిపి నేతలు కూడా భూమి దద్దరిల్లిపోతోందన్నట్లు మీడియా సమావేశాలు పెట్టి ఒకటే రచ్చ చేస్తున్నారు.
బిజెపి-వైసిపి నేతలు కలవకూడదా ?
ఇక్కడే చాలా మందికి ఓ విషయం అర్ధం కావటం లేదు. బిజెపి, వైసిపి నేతలు కలిస్తే టిడిపికి వచ్చే నష్టమేంటి ? టిడిపి మీడియా సమాచారం ప్రకారమే అమిత్ షా ను కలసిన బుగ్గన చంద్రబాబు పాలనలోని అవినీతిపై ఆధారాలు అందించారట. అందులో కూడా తప్పేముంది ? ముఖ్యమంత్రి అవినీతిపై ప్రతిపక్ష సభ్యుడు కేంద్రంలోని జాతీయ పార్టీ అధ్యక్షుడిని కలిసి ఫిర్యాదులు చేయకూడదని ఎక్కడైనా ఉందా ? అవినీతికి ఆధారాలు ఇవ్వటంలో తప్పేముంది ?
మన్మోహన్ ను చంద్రబాబు కలవలేదా ?
ఓ పదేళ్ళు వెనక్కు వెళదాం. అప్పట్లో వైఎస్సార్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ ప్రధానప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అప్పటి ప్రధానమంత్రి మన్మోహస్ సింగ్ ను కలవలేదా ? జాతీయ స్ధాయిలో ప్రధాన పార్టీల నేతల వద్దకు వెళ్ళి నివేదికలు అందించలేదా ? అప్పట్లో చంద్రబాబు చేసింది తప్పు కానపుడు ఇపుడు బుగ్గన చేసింది కూడా తప్పెలా అవుతుంది ? పైగా ఏపి భవన్లో తాను ఆకులను కలిసినట్లు బుగ్గన చెబుతున్నారు కదా ? అదే సమయంలో టిడిపి విప్ కూన రవికుమార్ ను కలిసినట్లు కూడా చెబుతున్నారు కదా ? కానీ టిడిపి మీడియా ఒక్క ఆకుల-బుగ్గన భేటీ గురించే మాత్రమే ప్రస్తావించటంలో ఆర్ధమేంటి ?
ప్రతిపక్ష నేతలు కలిస్తే కుట్ర రాజకీయాలేనా ?
తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లోని ఏ ఇద్దరు నేతలు కలిసినా కుట్ర చేస్తున్నట్లు ప్రచారం చేయటంలో చంద్రబాబు చాలా ఎక్స్ పర్ట్ అన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. తాను ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని జనాలు నమ్మించటంలో కూడా సిద్ధహస్తుడే. చంద్రబాబుకున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే, చంద్రబాబు చేసే తప్పులను కప్పిపుచ్చేందుకు మద్దతుగా మెజారిటీ మీడియా నిలబడటమే. చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలబడుతున్న మెజారిటీ మీడియా ప్రతిపక్షాల విషయంలో మాత్రం బురద చల్లటానికి ఎటువంటి మొహమాటం పడదు. ఆ మద్దతుతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటారు రాష్ట్రంలో. ఇపుడు జరుగుతున్నది కూడా అందులో భాగమే.