చంద్రబాబునాయుడుపై సిబిఐ విచారణ తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అంతపనీ జరిగేట్లే ఉంది. ఇంతకీ సోము ఏమంటారంటే, చంద్రబాబు హయాంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు పలు ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులతో అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని ప్రధాన ప్రతిపక్షం వైసిపి చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.
చంద్రబాబుపై సిబిఐకి ఫిర్యాదు
ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే బిజెపి కూడా వైసిపికి జత కలిసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులే కాకుండా నీరు-చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గృహనిర్మాణం లాంటి పథకాల్లో కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తటం మొదలుపెట్టారు. సరే, తమ ఆరోపణలకు సోము ఏవో కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారనుకోండి అది వేరే సంగతి.
లక్ష కోట్ల దోపిడీ జరిగేదే
తాజాగా వీర్రాజు మాట్లాడుతూ, కేవలం ఒక్క గృహనిర్మాణ పథకం అమలులోనే చంద్రబాబు రూ. 30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. మొత్తం అవినీతి బయటకు రావాలంటే, సిబిఐ విచారణ చేయించాల్సిందేనంటూ చెబుతున్నారు. చంద్రబాబు కోరినట్లు 10 లక్షల ఇళ్ళు మంజూరు చేసుంటే లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగేదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పోవాలంటే మరో విప్లవం రావాల్సిందేనని లేకపోతే చంద్రబాబుతో చాలా ప్రమాదమని వీర్రాజు చెబుతున్నారు.