ఆమెకు రాజకీయాలు కొట్టిన పిండి.. అయినా ఆమె ఇప్పుడు రాజకీయాలు చేయడం లేదు. ఆమెకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క నేతా తెలుసు. అయినా ఆమె మౌనం పాటిస్తున్నారు. రాజకీయాలంటే.. విరక్తి చెంది అలా చేస్తున్నారా? లేక రాజకీయా లంటే.. ఇష్టం లేక అలా చేస్తున్నారా? ఇవీ కాక.. అవకాశం రాక మౌనంగా ఉండిపోయారా? ఇప్పుడు ఇవన్నీ.. పెద్దసందేహా లుగా మారిపోయాయి. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరంటే.. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా మారారు ప్రతిభా భారతి. అప్పటి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. అనతి కాలంలోనే రాజాం నియోజవకర్గం నుంచి గెలుపొందారు.
టీడీపీలో ఉండగానే ఆమెకు పలు ఉన్నత పదవులు దక్కాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు ప్రతిభాభారతి ఓటమిపాలయ్యారు. అయితే ఓటమి కొంతమందికి గుణపాఠం నేర్పుతుందంటారు. కానీ రెండుసార్లు ఓటమి చవి చూసినా స్థానిక టీడీపీ నేతలలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదన్న భావన క్యాడర్లో వ్యక్తమవుతోంది. యాక్టివ్గా ఉండాల్సిన ప్రతిభా భారతి.. అలా నిరాశ నిస్పృహలతో వ్యవహరిస్తున్నారని సమాచారం.
గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనను ఎమ్మెల్సీ చేస్తారని ఆమె ఎంతో ఎదురు చూశారు. అయితే, చంద్రబాబు నామమాత్రంగా కూడా ప్రతిభా భారతి పేరును స్మరించలేదు. దీంతో ఆమె తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మహానాడుకు వచ్చినా.. ముక్తసరిగా వుండి ఆ వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. మరి ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక కేడర్ తికమక పడుతుండడం గమనార్హం. పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదనే వారిలో ప్రతిభా భారతి ముందు వరుసలోనే ఉన్నారు.
అయితే, ఆమె పార్టీపై అలుగుతున్నారు కానీ.. ఎందుకిలా నాఖర్మ కాలిపోయింది? అని మాత్రం ప్రతిభా భారతి ఆత్మపరిశీలన చేసుకోవడం లేదని అంటున్నారు సీనియర్లు. ఎక్కడైనా ఓ ఎమ్మెల్యే రెండు సార్లు ఓడిపోతే.. అక్కడ జరిగిన పరాభవంపై పోస్టు మార్టమ్ చేసుకుంటారు. ఎందుకంటే.. మళ్లీఆ తప్పులు జరగకుండా చూసుకుంటారు. కానీ.. ప్రతిభా భారతి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరించడం పార్టీకి తీరని నష్టం తెస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే మూడుసార్లు వరుసగా ఓడిన ఆమెను చంద్రబాబు తనదైన స్టైల్లో పక్కన పెట్టేస్తారని కూడా అంటున్నారు.