ఢిల్లీ కేంద్రంగా ఏదో జరుగుతోందనే ఆందోళన పెరిగిపోతోంది చంద్రబాబునాయుడులో. అయితే, ఏం జరుగుతోందనే విషయంలో క్లారిటీ మాత్రం అందటం లేదు. దాంతో చంద్రబాబుతో పాటు టిడిపి నేతల్లో కూడా రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. నాలుగు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్రమోడి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ లు వరుసగా అవుతున్న భేటీలు తనకు వ్యతిరేకంగా అనే చంద్రబాబు అనుమానిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ, ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణతో పాటు పురంధేశ్వరి మంగళవారం నుండి ఈ భేటీల్లో పాల్గొంటున్నారట. దాంతో అప్పటి నుండే వారి చర్చల్లో మరింత వేగం పెరిగిందని చంద్రబాబులో ఆందోళన పీక్ స్టేజ్ కు చేరుకుంది. అంటే బిజెపిలో ఏ నలుగురు కలిసినా తనకు వ్యతిరేకంగానే కలిసారని ఆందోళన పెరిగిపోతుందంటే చంద్రబాబు మానసిక పరిస్ధితేంటో అర్ధమైపోతోంది.
కుట్రలు పరాకాష్టకు చేరుతోందా ?
ఎంపిలతో భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వైసిపి, బిజెపి కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నట్లు ఆరోపించటం విశేషం. తనను లేదా రాష్ట్రాన్ని ఏదో చేద్దామని ఢిల్లీలో పథక రచన జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు తనకు సంకేతాలు కూడా అందుతున్నాయట. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయటం లేదనే విభేదించి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చంద్రబాబు ఎంపిలతో చెప్పారు. కాబట్టి బిజెపి కుట్రలను ప్రజలు అంగీకరించరని, తప్పి కొడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలను నేతలందరూ జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పారు.
బిజెపికి వైసిపి కోవర్టా ?
బిజెపికి వైసిపి కోవర్టుగా మారిందంటూ చంద్రబాబు ఆరోపించటం గమనార్హం. ఎందుకంటే, బిజెపి నేతలను వైసిపి ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కలవటమే నిదర్శనమనే విచిత్రమైన లాజిక్ తెరపైకి తెచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపిని వారికి వంతపాడుతున్న వైసిపి రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారంటూ ధ్వజమెత్తారు. పిఏసి ఛైర్మన్ గా ఉన్న బుగ్గన ఏమైనా రిపోర్టు ఇవ్వదలచుకుంటే స్పీకర్ కు ఇవ్వాలట. ఆ నివేదికను స్పీకర్ సభ ముందుంచి చర్చలు జరిపి చర్యలు తీసుకుంటారట. ఇప్పటి వరకూ స్పీకర్ ఎప్పుడైనా ఆ పనిచేశారా ? సభలో వైసిపి సభ్యులు మాట్లాడేందుకే అనుమతించని స్పీకర్ బుగ్గన ఇచ్చే నివేదికను సభలో చర్చకు పెడతారని ఎవరైనా నమ్ముతారా ?
పెరిగిపోతున్న టెన్షన్
నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా, ఉక్కు కర్మాగారం కోసం టిడిపినే పోరాడుతోందనే విచిత్రమైన జోకులేస్తున్నారు. నాలుగేళ్ళల్లో ఏనాడూ ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు పొరబాటుగా కూడా మాట్లాడని విషయం అందరికీ తెలుసు. సరే, పనిల పనిగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోతే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు ? పరిపాలన గురించి జగన్ కు ఏం తెలుసంటూ ప్రశ్నించారు. అప్పటికి చంద్రబాబు పుట్టుకతోనే ముఖ్యమంత్రి లక్షణాలతో పుట్టినట్లు. పాలన మొత్తం తనకే తెలుసన్నట్లు మాట్లాడుతున్న40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబు పాలన ఎంత సవ్యంగా సాగుతోందో అందరూ చూస్తున్నదే. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు ఏ స్ధాయిలో టెన్షన్ పెరిగిపోతోందో అర్ధమైపోతోంది.