జెసి దివాకర్ రెడ్డి.. రాష్ట్రంలో పరిచయం అవసరం లేని నేత. ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే, జిల్లా మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ కొంప కూల్చటానికి జెసి దివాకర్ రెడ్డి ఒక్కళ్ళు చాలన్నట్లుగా తయారైంది పరిస్దితి. జిల్లా టిడిపి నేతల్లో ఏ ఇద్దరు కలసినా ప్రస్తుతం జెసి గురించే మాట్లాడుకుంటున్నారు. జెసి ఒకళ్ళ అదుపాజ్ఞల్లో ఉండే రకం కాదు. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తారు. నిజాలే చెబుతానంటూ నాలుగు గోడల మధ్య చెప్పాల్సిన విషయాలు కూడా బహిరంగంగా మైకులోనే చెప్పేసే నేత. నిజానికి జెసిని భరించటం సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాని ఏకవ్యక్తి నేతృత్వంలో నడిచే టిడిపి వల్ల కాదు.
10 మంది ఓడిపోవటం ఖాయం
ఇంతకీ ప్రస్తుత విషయానికి వస్తే, తాజాగా మీడియాతో జెసి మాట్లాడుతూ, ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే మొత్తం 14 సీట్లలో టిడిపి 10 నియోజకవర్గాల్లో ఓడిపోవటం ఖాయమని పెద్ద బాంబు పేల్చారు. పైగా అదే విషయాన్ని పదే పదే బహిరంగంగానే చెబుతున్నారు. అదే సమయంలో గెలిచే సీట్లేవో జెసి చెప్పలేదుకాబట్టి ఎంఎల్ఏలందరూ కలిసి జెసిపై ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలో పార్టీని నాశనం చేయటానికి జెసి ఒక్కడు చాలంటూ మండిపోతున్నారు.
సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తున్న జెసి
పోయిన ఎన్నికల్లో అనేక సమీకరణాల కారణంగా తెలుగుదేశంపార్టీ 12 సీట్లలో గెలిచింది. వైసిపి ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో గెలిచింది. అయితే, మారిన రాజకీయ పరిణామాల కారణంగా కదిరి ఎంఎల్ఏ చాంద్ భాష టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే చంద్ఎబాబు ఫిరాయింపులను ప్రోత్సహించటం మొదలుపెట్టారో జెసి దాన్ని అవకాశంగా తీసుకున్నారు. కాంగ్రెస్, వైసిపిల్లో ఉన్న తన అనుచరులను టిడిపిలోకి లాక్కున్నారు. అదే విధంగా తన సొంత మనుషలనుకున్న వారిని వివిధ నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో తన వారికందరికీ టిక్కెట్లు ఇప్పించుకోవాలన్నది జెసి వ్యూహంగా కనబడుతోంది. ఎప్పుడైతే జెసి చాపక్రిందలాగ తన వ్యూహాన్ని అమలు పరచటం మొదలుపెట్టారో అప్పటి నుండి ఎంఎల్ఏల్లో అభద్రత మొదలైంది.
ఆందోళనలో ఎంఎల్ఏలు
జెసి దెబ్బకు జిల్లాలోని ఏడుగురు ఎంఎల్ఏల్లో అభద్రత మొదలైంది. ఇందులో రాయదుర్గంలోని మంత్రి కాలువ శ్రీనివాసులు కూడా ఉండటం గమనార్హం. రాయదుర్గంలో తన మేనల్లుడు, ఎంఎల్సీ దీపక్ రెడ్డి ని మంత్రికి పోటీగా తిప్పుతున్నారు. గుంతకల్ లో ఎంఎల్ఏ జితేందర్ గౌడ్ కు ప్రత్యామ్నాయంగా ఇంకో నేతను చేరదీశారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి, ఎంఎల్ఏకు వ్యతిరేకంగా తన పిఏని రంగంలోకి దింపారు. కల్యాణదుర్గంలో ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరికి పోటీగా మరో మద్దతుదారుడిని దింపారు. అనంతపురం నియోజకవర్గంలో వైసిపి నుండి లాక్కున్న గుర్నాధరెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. పెనుగొండలో బిసి పార్ధసారధికి పోటీగా మరో నేతను తీసుకొచ్చారు. ఇలా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎంఎల్ఏలకు ప్రత్యామ్నాయంగా పలువురు నేతలను రంగంలోకి దింపారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
చంద్రబాబు వద్ద ఆశావహుల జాబితా
వివిధ నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ప్రోత్సహించటంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపనున్న అభ్యర్ధులంటూ ఆశావహుల జాబితాను కూడా చంద్రబాబుకు అందించారట. తాను ఇచ్చిన జాబితా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారట. ఇపుడున్న ఎంఎల్ఏలకే మళ్ళీ టిక్కెట్లిస్తే కనీసం 10 మంది ఓడిపోవటం ఖాయమంటూ చంద్రబాబుకే చెప్పారట. జెసి చెప్పినట్లుగా చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారా లేదా అన్నది వేరే విషయం. తాను చెప్పిన వారికి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వకపోతే జెసి ఏం చేస్తారన్నదే కీలకం.