తూర్పు గోదావరి జిల్లాపై చంద్రబాబునాయుడు పూర్తి స్ధాయిలో నిఘా పెట్టారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతల యాక్టివిటీపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకోవటానికి వీలుగా చంద్రబాబు పక్కా నిఘా పెట్టారు. పార్టీలోని ఎంఎల్ఏల మధ్యే కాకుండా నేతల మధ్య కూడా వివాదాలు బాగా పెరిగిపోయాయని చంద్రబాబుకు ఎప్పటి నుండో సమాచారం అందుతోంది. అయితే, అప్పట్లో వాటిపై చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టలేదు. నేతల మధ్య గొడవలు పెరిగిపోవటానికి ఒక రకంగా చంద్రబాబు కూడా కారణమే. కాకపోతే తొందరలో ఎన్నికలు వస్తుండటం, ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల స్పందన చూసిన తర్వాత చంద్రబాబులో ఆందోళన మొదలైందని సమాచారం.
చంద్రబాబులో ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు టిడిపి నేతలు, తటస్తులు వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితమే జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఈ జిల్లాలో కూడా నేతలెవరైనా వైసిపిలో చేరే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అదే విధంగా ప్రముఖులైన తటస్తుల విషయంపై కూడా ఆరాతీయాలంటూ నిఘా అధికారులను చంద్రబాబు పురమాయించారట. ఎవరైనా ప్రముఖులు వైసిపిలో చేరాలనుకుంటే అటువంటి వారిని గుర్తించి తనకు సమాచారం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారని సమాచారం. అంటే అటువంటి వారిని తన వద్దకు పిలిపించుకుని టిడిపిలోకి చేర్చుకోవాలన్నది బహుశా చంద్రబాబు ఆలోచన కావచ్చు.
వైసిపిలో చేరనున్న టిడిపి రాజోలు నేతలు
చంద్రబాబులో ఏ స్ధాయిలో ఆందోళన పెరిగిపోతోందంటే నేతలు, కార్యకర్తలతో ప్రతీ రోజూ టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఓ సమయంలో దాదాపు 40 నిముషాల పాటు కాన్ఫరెన్సులకు కేటాయిస్తున్నారు. నేతల మధ్యున్న గొడవలు, నేతలపై క్యాడర్ చేస్తున్న ఫిర్యాదులను చంద్రబాబు ఓపికగా వింటున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాబోయేది టిడిపియేనని పదే పదే చెబుతున్నారు. అంటే నేతలను, క్యాడర్ ను ఒక విధంగా హిప్నాటిజం చేస్తున్నట్లుగా ఉంటోందట చంద్రబాబు మాటలు. అయితే చంద్రబాబు ఇంత దృష్టిపెట్టినా కూడా రాజోలులో ఎంఎల్ఏ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు దాటికి తట్టుకోలేక తాము వైసిపిలో చేరుతున్నట్లు పలువురు మండల స్ధాయి నేతలు రంగం సిద్ధం చేసుకోవటం గమనార్హం. 200 కుటుంబాలతో వైసిపిలో చేరనున్నట్లు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు మీడియాలో ప్రకటించటంతో చంద్రబాబులో ఆందోళన మరింత పెంచేస్తోంది. జిల్లాలో జగన్ పర్యటన ముగిసేటప్పటికి ఇంకెంతమంది టిడిపి నేతలు వైసిపిలో చేరుతారో చూడాల్సిందే.