వచ్చే ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైసిపి, బిజెపిలు కలిసి పోటీ చేస్తాయనే దుష్ప్రచారాన్ని చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు పదే పదే చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ళుగా బిజెపితో అంటకాగిన టిడిపి ఎన్నికల సమయంలో మాత్ర బిజెపి-వైసిపిలకు సంబంధాలు అంటకడుతున్నట్లు ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న బిజెపి, టిడిపిల వల్లే రాష్ట్రం నష్టపోయిందంటూ మండిపడ్డారు. కేంద్రం మెడలువంచి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోంది వైసిపి మాత్రమే అని చెప్పారు.
చంద్రబాబు దోపిడిపై పుస్తకం
నాలుగేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న దోపిడిని పుస్తకంగానే కాకుండా సిడిల రూపంలో కూడా దేశమంతా పంచుతామంటూ బొత్సా చెప్పారు. టిడిపిలా ట్యాంపరింగ్ చేసే సంస్కృతి తమది కాదని, ఏం చేసినా ధైర్యంగానే చేస్తామన్నారు. తమ ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీకి వెళితే టిడిపి నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ను, మహారాష్ట్ర బిజెపి మంత్రి భార్యకు టిటిడి ట్రస్ట్ బోర్డులో స్ధానం కల్పించిన చంద్రబాబే కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు రక్షణా ?
పోయిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చిన చంద్రబాబ ఇపుడు తనకు ప్రజలే రక్షణగా నిలవాలని ఎందుకు చెబుతున్నారో అర్ధం కావటం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ప్రజలు అసలు ఎందుకు రక్షణగా నిలవాలంటూ నిలదీశారు. అవినీతిలో పీకల్లోతులో కూరుకుపోయన తర్వాత కేంద్రం చర్యలు తీసుకుంటుంది చంద్రబాబులో భయం మొదలైందన్నారు. అందుకే విచారణలు, చర్యల నుండి తప్పించుకునేందుకు ప్రజలను తనకు రక్షణగా నిలవాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నట్లు మండిపడ్డారు. గ్రామస్ధాయి నుండి రాజధాని వరకూ మొత్తం దోచుకుని చంద్రబాబు పారిపోవాలని చూస్తున్నట్లు బొత్సా అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం.