ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఒక అద్భుతమైన భారత జాతి యావత్తు మెచ్చే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయం లో ఐఖ్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికను ఆయన తప్పుబడుతూ "అది భారతదేశ అంతర్గత విషయం" అని తేల్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసదుద్దీన్ చేసిన కామెంట్లు భారత జాతిలో ఐఖ్యతా రాగం మరువలేనిదని పిస్తుంది.
"ఇది మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ఇది ఇండియా సమస్య. నా చివరి శ్వాస వరకు ప్రధాని నరేంద్ర మోదీని నేను వ్యతిరేకిస్తా! కానీ, దేశం ప్రతిష్టకు సంబంధించిన అంశం జోలికొస్తే మాత్రం ప్రభుత్వానికి మేం మద్ధతుగా నిలుస్తాం" అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
ఒక దేశ అంతర్గత విషయాల్లో సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించి జోక్యం చేసుకునే హక్కు ఐఖ్యరాజ్య సమితి విభాగానికి లేదు. 'మానవ హక్కుల సంఘం' అన్నది ఈ దేశం లో ఒక స్వతంత్ర విభాగం. ఈ విషయంలో మేం ప్రభుత్వం వెంటే ఉంటాం! అని నిర్ద్వందంగా స్పష్టం చేశారు. శనివారం మక్కా మసీదులో నిర్వహించిన ఒక సభలో ఆయనపై వ్యాఖ్యలు చేశారు.
అయితే కశ్మీర్ లో పరిస్థితికి మాత్రం "పీడీపీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం" కారణమని ఆయన ఆక్షేపించారు. "ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక, అక్కడి పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వ "దౌత్య వైఫల్యాన్ని" బహిరంగపరుస్తుంది. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద దాడులను నిలువరించటంలో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి 'ఐక్య రాజ్య సమితి - మానవ హక్కుల విభాగం' తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కశ్మీర్కు సంబంధించి ఇలాంటి నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికపై భారత్ ఘాటుగా స్పందించింది. నివేదిక భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను ఉల్లంఘించేలా ఉంది.
ఇది పూర్తిగా దురుద్దేశంతో కూడిన, మోసపూరితమైన, ఇతరుల ప్రేరణతో రూపొందించిన నివేదికలా ఉంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రం మొత్తం సార్వభౌమ భారత్ లో అంత ర్భాగం. "పాక్ చట్టవిరుద్ధంగా, దురాక్రమణ ద్వారా భారత్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది" అని భారత విదేశాంగ శాఖ మానవ హక్కుల సంఘానికి లేఖ రాసింది.