రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి కారణమైన లగడపాటి రాజగోపాల్ ముందస్తు సర్వేలో నిజమెంత? రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల రాజకీయ సారాన్ని ఆయన కేవలం 18 నియోజకవర్గాల సర్వేతో తేల్చి చెప్పడం ఔచిత్యమేనా? జిల్లాకో రెండు నియోజకవర్గాలు తీసుకున్నా.. కనీసం 26 నియోజకవర్గాల్లో అయినా ఈ సర్వే చేసి ఉండాల్సిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అత్యంత కీలకమైన నాలుగు నియోజకవర్గాలను అసలు ఈ సర్వే స్పృశించలేదు. వాటిలో ప్రధానమైంది విజయవాడ తూర్పు. ఇక్కడ కమ్మసామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరారు. దీంతో సగానికిపైగా ఓట్లు ఇక్కడ చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఆ పార్టీలోనే శత్రువులు తయారయ్యారు.
ఇక్కడ వైసీపీ నుంచి 2014లో గెలుపొందిన గొట్టిపాటి రవి టీడీపీలో చేరిపోయారు. అయితే, ఇదే టికెట్ను ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటా యని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరస్థితులపై సర్వే ఫలితం వచ్చి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డను కూడా సర్వే నుంచి మినహాయించారు. ఇది కూడా అత్యంత ఆసక్తికర నియోజకవర్గం. ఇక్కడ టికెట్ పోరులో టీడీపీ నాయకులు అలుపెరుగని ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. అధినేత మాటలను సైతం పెడచెవిన పెడుతున్నారు. ఇక్కడ బరిలో ఉన్న మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల్లో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా.. మరో వర్గం పనిగట్టుకుని ఓడించడం తథ్యం.
మరి ఈ నియోజకవర్గంలోనూ సర్వే చేసి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. అదేసమయంలో మరో అత్యంత ముఖ్య నియోజకవర్గం నెల్లూరు సిటీ. ఇక్కడ నుంచి బరిలోకి దిగాలని ఏకంగా మంత్రి పొంగూరు నారాయణ ప్లాన్ చేస్తున్నారు. ఆయనకు స్వంతగా విద్యాసంస్థలు ఉండడం, స్థానికంగా పలుకుబడి ఉండడం కలిసి వస్తున్న పరిణామా లుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిపైనా సర్వే సాగి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వెలువడుతోంది. మొత్తంగా రాజగోపాల్ సర్వే సాగిన తీరు ఎలా ఉన్నా ఎంచుకున్న నియోజకవర్గాలపైనే అసంతృప్తి పెల్లుబుకుతోంది. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం, మరిన్ని సంస్థలు సర్వే చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అనేవారూ ఉన్నారు.