దశాబ్దాలుగా తెలుగుదేశంపార్టీకి బిసి సామాజికవర్గం దూరమైనట్లేనా ? జస్టిట్ ఈశ్వరయ్య చెబుతున్న మాటలను బట్టి అలాగే అనుకోవాలి. ఓ ప్రముఖ మీడియాతో ఈశ్వరయ్య మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బిసిలు తెలుగుదేశంపార్టీకి ఓట్లెయ్యరంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వివిధ సామాజికవర్గాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత వచ్చినట్లుగానే బిసిల్లో కూడా వ్యతిరేకత మొదలైందన్నారు. బిసి సామాజిక అభివృద్ధికి ఇచ్చిన హామీలను చంద్రబాబు మరచిపోవటమే కాకుండా కాపులను బిసిల్లోకి చేరుస్తామని ఇచ్చిన హామీపై బిసిలు మండిపోతున్నట్లు జస్టిస్ చెప్పారు.
టిడిపిని బిసిలు గుడ్డిగా నమ్మరా ?
దశాబ్దాల పాటు బిసి సామాజికవర్గం గుడ్డిగా టిడిపికి ఓట్లేసినా రాబోయే ఎన్నికల్లో మాత్రం అంత సీన్ ఉండదన్నారు. ఎందుకంటే, ఒకపుడు పార్టీనే ముందు సామాజికవర్గ ప్రయోజనాలు తర్వాతే అనే వాదన బిసిల్లో ఉండేదన్నారు. కానీ చంద్రబాబు వైఖరి, పాలనా తీరు చూసిన తర్వాత ముందు సామాజికవర్గం తర్వాతే పార్టీ అనే ఆలోచన బిసిల్లో వచ్చిందట. గడచిన నాలుగేళ్ళుగా రాజకీయ, ఆర్దిక ప్రయోజనాలన్నీ కేవలం మూడు కులాలకు మాత్రం అందుతుండటంతో బిసిల్లో కూడా చైతన్యం వచ్చిందన్నారు.
అవినీతిపై బిజెపి ఆధారాలు సేకరిస్తోందా ?
పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదంటూ ఈశ్వరయ్య మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి తారస్ధాయికి చేరుకుందని కూడా ఆరోపించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఆధారాలు సేకరిస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. సిబిఐ విచారణ లేదా ఏదో కేంద్రప్రభుత్వంలోని ఏదో ఓ ఏజెన్సీతో అవినీతిపై విచారణ జరిపించే అవకాశాలున్నట్లు కూడా జస్టిస్ అభిప్రాయపడ్డారు.
అవినీతిపై విచారణ జరుగుతుందేమో ?
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై స్పష్టంగా స్పందించని ఈశ్వరయ్య బిసి సామాజికవర్గం ప్రయోజనాలపై మాత్రం సూటిగానే స్పందించారు. న్యాయమూర్తులుగా బిసిలను నియమించవద్దని స్వయంగా చంద్రబాబు చెప్పటం చాలా తప్పన్నారు. రాసిన లేఖను చూస్తేనే బిసి సామాజికవర్గంపై చంద్రబాబుకు ఎటువంటి అభిప్రాయముందో అర్ధమైపోతోందని మండిపడ్డారు. పనిలో పనిగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై జస్టిస్ సానుకూలంగా స్పందించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రపై జనాలు సానుకూలంగా స్పందిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే అన్నారు.