ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర లో పాల్గొంటున్న వైఎస్ జగన్ ఎఫెక్ట్ టీడీపీపై పడుతుందని కొంత మంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవుతూ వస్తున్నారు. తాజాగా వైసీపీలోకి టీడీపీ ముఖ్య నేతలు వెళ్తున్నారని రూమర్లు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఏపీలో ఎన్నికల మూమెంట్ హీటెక్కడంతో జంపింగ్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అధికార పార్టీలో లోడ్ ఎక్కువుగా ఉండడంతో విపక్ష పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు జోరందుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల్లో ఒకరు మాజీ మంత్రి, టాప్ లీడర్ కాగా, మరొకరు ఓ కీలక నియోజకవర్గానికి చెందిన నేత కావడం విశేషం. ఈ ఇద్దరి విషయానికి వస్తే మాజీ మంత్రి కొండ్రు మురళి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. యువకుడు, దళితుడు కావడంతో పాటు నాడు వైఎస్ ఎంకరేజ్తో ఆయన రెండోసారి గెలిచాక మంత్రి కూడా అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి పోటీచేసిన ఆయన రెండుసార్లు టీడీపీలో కాకలు తీరిన ప్రతిభాభారతిని ఓడించారు. చాలా తక్కువ టైంలోనే ఆయన బలమైన నేతగా దూసుకుపోయారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పతనమవ్వడంతో ఆయన చాలా రోజులుగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో ముందుగా టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన చూపులు వైసీపీ వైపు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వైసీపీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో పాటు సీటు కూడా ఖరారు చేయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మురళి వచ్చే నెల 8వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
మురళి చేరికతో ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో బలమైన లీడర్ దొరికినట్లే అవుతుంది. ఇక మరో క్యాండెట్ విషయానికి వస్తే టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ గత ఎన్నికల్లో బాలకృష్ణ కోసం తన సిట్టింగ్ సీటును త్యాగం చేశారు. ఆ సందర్భంలో ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి పదవి ఇస్తామని చెప్పినా ఇప్పుడు ఆయన్ను పట్టించుకున్న దాఖలాలే లేవు.
ఘనీ ఇప్పటికే పార్టీ మారాలనుకోగా పార్టీ నేతలు వారించడంతో ఆయన వైసీపీ ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది. ఆయన అసంతృప్తిని చల్లార్చి ఆయనకు ఇప్పటకీ అయినా ప్రయారిటీ ఇచ్చేలా చేయకపోవడంతో ఘనీ త్వరలోనే వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా హిందూపురంలో కీలక నేతతో పాటు ఉత్తరాంధ్రలో ఎస్సీల్లో పట్టున్న మురళి ఇద్దరూ వైసీపీలోకి చేరితే అది ఆ పార్టీకి చాలా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.