విభజనకు ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మరోసారి గుర్తుచేశాయి... ఏపీ ఎన్జీవో, ప్రగతి భవన్ ఎన్జీవో ఉద్యోగుల మధ్య నెలకొన్న పరిస్థితులు. నాలుగేళ్లు పూర్తయినా ఇంకా కీలకమైన విభజన సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగుల మధ్య ఆగ్రహావేశాలు పెల్లుకుబుకున్నాయి. ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న సమస్య.. ఇప్పుడు ఒక్కసారిగా ఎగిసిపడింది. సమస్యలు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు, నాయకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులకు విభజనకు ముందు కేటాయించిన స్థలం విషయంలో ఏపీ ఎన్జీవో, ప్రగతి భవన్ ఎన్జీవో ఉద్యోగుల మధ్య చెలరేగిన వివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు పరిష్కారానికి ఇద్దరు సీఎంలు శ్రమిస్తున్నారు. సామరస్యపూర్వకంగా రాష్ట్రాలకు సాధించుకోవాల్సిన అంశాల విషయంలో ఇద్దరూ పలు సార్లు భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో స్థలాల విష యంలో ఉద్యోగుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమేగాక ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ అబిడ్స్లోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఏపీ ఎన్జీవోలు, భాగ్య నగర్ టీఎన్జీవోల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం నెట్టుకున్నాయి. అప్పటి ప్రభుత్వం గచ్చిబౌ లిలో ఉద్యోగులకు కేటాయించిన స్థలం విషయంలో నెలకొన్న వివాదమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డి.. ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సమావేశమయ్యారు.
స్థలాల కేటాయింపు, డబ్బుల విషయమై మాట్లాడుకునేందుకు రావాలంటూ ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పలువురు సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి తెలంగాణ ఉద్యోగసంఘాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా స్థలాల కేటాయింపు, డబ్బుల విషయం గురించి మాట్లాడడం లేదని, కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. సొసైటీ జనరల్ బాడీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ బాబుకు స్వల్పంగా గాయాలయ్యాయి. కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి.
అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. గచ్చిబౌలిలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రెండు ప్రాంతాల ఉద్యోగులు సమానంగా పంచుకుందామని అశోక్ బాబు అన్నారు. సొసైటీ డబ్బులు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, వాటిని ఎవరూ వాడుకోలేదని తెలిపారు. కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. అశోక్ బాబు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సొసైటీని వెంటనే విభజించాలని ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.