కడప కేంద్రంగా రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైసిపి కూడా దీక్షకు కూర్చుంటోంది. ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాదరెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు 48 గంటల దీక్షకు దిగుతున్నారు. సోమవారం ఈ నిర్ణయం తీసుకోగానే పార్టీ తరపున ఏర్పాట్లు జరిగిపోయాయి. కడపలోని శివాలయం సెంటర్లో ఎంఎల్ఏ దీక్షకు కూర్చుంటారు. పట్టణంలో భారీ ర్యాలీ తర్వాత దీక్ష మొదలవుతుంది. ఎప్పుడైతే వైసిపి ఎంఎల్ఏ దీక్ష విషయం ప్రకటించారో వెంటనే పోలీసులు, అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.
కడపలో ఉద్రిక్త వాతావరణం
ఎందుకంటే, బుధవారం నుండి ఉక్కు పరిశ్రమ డిమాండ్ తోనే టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా నిరాహార దీక్షకు దిగుతున్నట్లు గతంలోనే ప్రకటించారు. రమేష్ దీక్షను కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో చేస్తున్నారు. అందుకు అధికార యంత్రాంగంతో పాటు టిడిపి నేతలు కూడా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు దీక్ష చేసినా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనటంలొ సందేహం అవసరం లేదు. కాబట్టి టిడిపి నేతలు దీక్ష కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు పలువురు నేతలు కడపకు చేరుకుంటున్నారు. అదే పద్దతిలో వైసిపి ఎంఎల్ఏ ప్రసాద్ రెడ్డి దీక్ష కు మద్దతుగా పలువురు వైసిపి ఎంఎల్ఏలు, నేతలు కూడా కడపకు చేరుకుంటున్నారు.
మాటల యుద్దంతోనే దీక్షలు ఆరంభం
టిడిపి ఆరంభించబోయే దీక్షకు ఒక్కరోజు ముందుగానే వైసిపి దీక్షకు దిగుతుండటం సహజంగానే టిడిపి నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందులోనూ రెండు దీక్షలూ కడపలోనే కావటంతో ఎప్పుడేమవుతుందో అన్న ఆందోళన స్ధానికుల్లో పెరిగిపోతోంది. ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి టిడిపి కేంద్రంపై మండిపడుతుంటే, వైపిపి చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. దాంతో రెండు పార్టీలనేత మధ్య కొంతత కాలంగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలో పోటీ దీక్షలు ఎక్కడికి దారీ తీస్తుందో అన్న ఆందోళన స్ధానికుల్లో పెరిగిపోతోంది.