ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జగన్ పదే పదే చేస్తున్న విమర్శలు తనను బాధించాయని ఆయన తన రాజీనామా లేఖలో చెప్పారు.తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాటంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నారని పరకాల మండిపడ్డారు. తన వల్ల ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు తన కుటుంబంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నాలుగేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న పరిస్థితిలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఇటీవల వైయస్ జగన్, బొత్స సత్యనారాయణలు మాట్లాడుతూ.. భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉంటారని, భర్త ప్రభాకర్ మాత్రం చంద్రబాబు పక్కన ఉంటారని, అంటే బీజేపీతో ఇంకా సంబంధం కొనసాగిస్తూన్నారని..ఎద్దేవా చేశారు.. ఇదేం రాజకీయమని విమర్శించారు. అయితే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన కొత్తలోనే, పరకాల ఈ నిర్ణయం తీసుకున్నా, అప్పుడు చంద్రబాబు ఒప్పుకోలేదు.
మీ సామర్ధ్యం మీద, మీ మీద విశ్వాసం ఉంది,ఎవరు ఏమి అనుకున్నా, మీరు ఇక్కడే ఉండాలి అని ఆయన్ను అప్పట్లో వారించినట్టు వార్తలు వచ్చాయి. కాని, జగన్ మోహన్ రెడ్డి మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి, ఆరోపణలు చెయ్యటంతో, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకూడదు, ఆయన పోరాటాన్ని, జగన్ లాంటి వారు తన వాళ్ళ ఎగతాళి చెయ్యటంతో, ఈ రోజు రాజీనామా చేసారు. నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం.... నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్షమీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక... నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృఢ అభిప్రాయం.... అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటానని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.