'నేను తొమ్మిదేళ్ళుపాలించా ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రాలేదుస...చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్య.
నాయీ బ్రాహ్మణులతో సమావేశం సందర్భంగా ఆ సంఘాల నేతలతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు చాలా వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే, 9 ఏళ్ళ చంద్రబాబు గత పాలనలో ఎవరూ రోడ్డుమీకు రాలేదని చెప్పటం శుద్ధ అబద్ధం. చంద్రబాబు గత పాలన ఎలా సాగిందో అందరికీ బాగా తెలుసు. ఒకసారి ఫ్లాఫ్ బ్యాక్ లోకి వెళదాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గత పాలనను రెండుగా విభజిద్దాం. ఎందుకంటే, చంద్రబాబు మొదటిసారి సిఎం అయ్యింది 1995లో. 1994లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చినపుడు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఎన్టీ రామారావు. అప్పట్లో ప్రజలు అధికారం కట్టబెట్టింది ఎన్టీఆర్ కే కానీ చంద్రబాబు కాదు. 1995లో ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి దానికి అధికారమార్పిడి అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. అలాగ 1995లో చంద్రబాబు మొదటిసారిగా ముఖ్యమంత్రయ్యారు.
1995లో సిఎం ఎలా అయ్యారు ?
ఏ పద్దతిలో సిఎం అయ్యారో చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే కొంత కాలం చాలా భయంగా, ఇబ్బందిగా మసలుకునే వారు. ఎందుకంటే, ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఎప్పుడు మళ్ళీ తిరుగుబాటు మొదలవుతుందో అన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనబడేది. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందు హటాత్తుగా ఎన్టీఆర్ మరణించటంతో అప్పుడు చంద్రబాబులోని ఆందోళన తగ్గింది. వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రయ్యారు కాబట్టి ఎన్టీఆర్ బ్రతికున్నంత వరకూ ఏ వర్గం జోలికీ వెళ్ళలేదు. అప్పటికి పార్టీలో కూడా పరిస్ధితులు సర్దుకున్నాయి.
రెండో విడత పాలన ఎలా సాగింది ?
తర్వాత 1999లో మళ్ళీ ఎన్నికలొచ్చాయి. వాజ్ పేయ్ పుణ్యమా అంటూ రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. అప్పటి నుండి చంద్రబాబు తన తడాఖా ఏంటో జనాలకు చూపటం మొదలుపెట్టారు. విద్యుత్ చార్జీలు పెంచేశారు. ఆర్టిసి చార్జిలు పెంచేశారు. సంక్షేమపథకాల్లో కోతలు విధించారు. సంక్షేమ పథకాల అమలు నుండి ప్రభుత్వం మెల్లగా తప్పుకోవటం మొదలైంది. దాంతో వివిధ వర్గాలు రోడ్లపైకి వచ్చాయి. చాలా ఆందోళనలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.
బషీర్ బాగ్ లో కాల్పులు ఎవరి హయాంలో జరిగిందో ?
ముందుగా రోడ్డెక్కింది రైతులు. పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలు మొదలయ్యాయి. రైతులకు కాంగ్రెస్, వామపక్షాలు జత కలిశాయి. అంతా కలిసి పెద్ద ఎత్తున చేసిన ఆందోళనలతో రాష్ట్రం గందరగోళంగా తయారైంది. అప్పుడే హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. అప్పట్లో ఆ ఘటన దేశంలోనే పెద్ద సంచలనం. తర్వాత ఆందోళన చేస్తున్న డ్వాక్రా మహిళలపై అసెంబ్లీ ముందు నడిరోడ్డుపై పోలీసులు గుర్రాలతో తొక్కించటం కూడా పెద్ద సంచలనమే. అటువంటి ఘటనలు చంద్రబాబు సిఎం అయిన రెండో విడతలో చాలానే జరిగాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబు మాత్రం తన 9 ఏళ్ళ పాలనలో ఒక్కరూ రోడ్డెక్కలేదని చెప్పటంతో నెటిజన్లకు చేతినిండా పనిదొరికింది. సోషల్ మీడియాలో చంద్రబాబు 9 ఏళ్ళ పాలనపై విపరీతంగా సెటైర్లు దుమ్ము రేగిపోతోంది.