జమ్ము-కశ్మీర్లో పీడీపీ, బీజేపీల మధ్య బంధం తెగింది. పొత్తుల సంసారానికి కమలం పార్టీ కటీఫ్ చెప్పింది. బీజేపీ నిర్ణయంతో దేశంలో రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ పెద్దలు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారాలను గవర్నర్కు బదలాయిస్తున్నట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ రాంమాధవ్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ప్రజల హక్కులకు భద్రత లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నం చేసిందన్నారు. అయితే పొత్తుకు బీజేపీ రాంరా చెప్పడం.. గవర్నర్కు అధికారాలు బదలాయిస్తున్నట్లు ప్రకటించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావడానికి గవర్నర్కు అధికారాలు బదలాయించడం పరిష్కారం కాదని పలువురు అంటున్నారు. మరోవైపు పీడీపీకి కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు మద్దతు ప్రకటిస్తాయా..? లేదా..? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ఇదే సమయంలో దీనికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికల్లో మొత్తం 87 స్థానాలకుగాను పీడీపీ 28స్థానాలు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 12, నేషనల్ కాంగ్రస్ 15 సీట్లు, ఇతరులు ఏడు స్థానాల్లో గెలిచారు. అయితే పొత్తు నుంచి తప్పుకుంటూ అధికారాలు గవర్నర్కు బదలాయించడంలో బీజేపీ ఆంతర్యమేమిటన్నది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విఫలం చెందారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రముఖ జర్నలిస్టు సుజాత్ బుఖారీ హత్యనే నిదర్శనమని అంటున్నారు.
పీడీపీ తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారాలను గవర్నర్కు బదలాయిస్తున్నట్లు రాం మాధవ్ ప్రకటించారు. నిజానికి కథూవా ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం. హత్య ఘటన నేపథ్యంలోనే పీడీపీ, బీజేపీ నేతల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ కేంద్రం చేసిన ప్రకటన విషయంలోనూ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఎన్డీయే నుంచి మిత్రపక్షాలు దూరమవుతున్న సమయంలో పీడీపీతో బీజేపీ తెగతెంపులు చేసుకోవడం గమనార్హం. ఏదేమైనా ఎన్డీయే కోటకు పడిన బీటలు రోజు రోజుకు పెద్దవి అవుతున్నాయి.