ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలోని ఇసుక రీచులన్నింటినీ నారా లోకేష్ పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పటి వరకూ ఇసుక రీచులంటే టిడిపి నేతల ఆదాయానికి కల్పతరువుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. కోటి రెండు కోట్లు కాదు. నాలుగేళ్ళల్లో ఏకంగా వేల కోట్ల రూపాయల ఇసుకను తమ్ముళ్ళు దోచేశారంటూ వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇసుక రీచుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల చేతిల్లో నుండి తీసేసి వెలుగు సిబ్బందికి అప్పగిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. నిర్వహణ ఎవరి చేతిల్లో ఉంటే ఏంటి ? తెరవెనుకుండి నడిపించేది, దోపిడి చేసేది టిడిపి నేతలే అయినపుడు.
ఎవరికి ఉపయోగం ?
ఇసుక రీచులపై మంత్రివర్గ సమావేశం తీసుకున్న తాజా నిర్ణయం విచిత్రంగా ఉంది. ఇసుక రీచులను ఇప్పటి వరకూ ఉన్న డ్వాక్రా సంఘాల చేతి నుండి వెలుగు సిబ్బందికి మార్చినందు వల్ల ఏంటి ఉపయోగం ? ఎవరికి ఉపయోగం ? దీని వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా అంటే ఏమీ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే, డ్వాక్రా సంఘాలైనా, వెలుగు సిబ్బందైనా పనిచేసేది అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి హటాత్తుగా డ్వాక్రా సంఘాల చేతిలో నుండి తీసేసి వెలుగు సిబ్బంది చేతికి ఎందుకు అప్పగిస్తున్నారన్నది ప్రశ్న.
ఆధిపత్య గొడవలు
ఇసుక రీచుల నిర్వహణ చేతులు మారినా నాలుగేళ్ళపాటు యధేచ్చగా వేల కోట్ల రూపాయల ఇసుకను దోపిడి చేసేసిన నేతల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచుల నిర్వహణను అప్పగిస్తున్నట్లు నాలుగేళ్ళ క్రితం చంద్రబాబు ఎంతో అట్టహాసంగా ప్రకటించారు. పేరుకే డ్వాక్రా సంఘాలైనా తెరవెనుక ఉండి నడిపించిందంతా టిడిపి నేతలే అన్నది బహిరంగ రహస్యమే. ఇసుక నుండి కోట్ల రూపాయలు పిండుకుంటున్న కారణంగా చాలా జిల్లాల్లో టిడిపి నేతల మధ్యే ఆధిపత్య గొడవలు కూడా మొదలయ్యాయి. కొన్ని చోట్ల వైసిపి నేతలు కూడా పిండుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయనుకోండి.
పేరుకే డ్వాక్రా సంఘాలు
నాలుగేళ్ళపాటు డ్వాక్రా సంఘాలపై అపరామైన ప్రేమ కురిపించిన చంద్రబాబు హటాత్తుగా వెలుగు సిబ్బంది చేతిలో ఎందుకు పెట్టారన్నదే అర్ధం కావటం లేదు. కోట్ల రూపాయలను దోచేసుకున్న టిడిపి నేతలు డ్వాక్రా సంఘాలకు విదిల్చింది చాలా తక్కువే అన్న ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. పైగా రీచులన్నీ డ్వాక్రా సంఘాల పేర్లతోనే ఉన్నాయి. అయినా డ్వాక్రా సంఘాలను తప్పించారంటే తెర వెనుక ఏదో పెద్ద వ్యూహమే దాగుండాలి. వెలుగు సిబ్బంది చేతిలో పెట్టిన పర్యవేక్షణ అంతా ప్రభుత్వమే చేస్తుందట. మొన్నటి వరకూ డ్వాక్రా సంఘాల చేతిలో పెట్టినపుడు కూడా పై ఎత్తున పర్యవేక్షించింది గనుల శాఖే అన్న విషయం మరచిపోకూడదు. ఇపుడు కూడా అదే పద్దతిలో సాగుతుందనటంలో సందేహం లేదు.
లోకేష్ పర్యవేక్షణలోనే ఇసుక రీచులా ?
చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే ఇసుక రీచుల నిర్వహణ బాధ్యత నేరుగా కొడుకు, పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిధిలోకి తెచ్చినట్లుగా కనబడుతోంది. మొన్నటి వరకూ డ్వాక్రా సంఘాల చేతిలో ఉన్నా పై ఎత్తున గనులశాఖ పర్యవేక్షించేది. అంటే గనులశాఖకు ప్రత్యేకంగా మంత్రి సుజయ కృష్ణ రంగారావుండేవారు. దాంతో లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణకు సాధ్యం కాలేదేమో. ఇపుడు వెలుగు పరిధిలోకి తెచ్చారంటే పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోనే పనిచేస్తాయన్నమాట. అంటే పై రెండు శాఖలు లోకేష్ చేతిలోనే ఉన్నాయి. దాంతో ఇసుక వ్యవహారాలన్నీ ఇకపై లోకేష్ పరిధిలోకి తెచ్చారన్నమాట. మరి, చినబాబు పర్యవేక్షణలోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడి తగ్గుతుందో మరింత పెరిగిపోతుందో చూడాల్సిందే.