మంత్రివర్గ సహచరుడు గంటా శ్రీనివాస్ చంద్రబాబునాయుడు గాలి తీసేశారు. రెండు రోజులుగా టిడిపికి మద్దతుగా ఉండే ఓ మీడియాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అంటూ ఓ సర్వే రెండు రోజులు హడావుడి చేసింది. 19 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఆ ఫలితాలను మొత్తం 175 నియోజకవర్గాలకూ ఆపాదించటంలోనే సదరు సర్వే విశ్వసనీయత ఏంటో అందరికీ అర్ధమైపోయింది. దానికితోడు వైసిపి ఎంఎల్ఏ రోజా నగిరిలో గెలుస్తోందని మొదటి రోజు రాసి మరుసటి రోజు ఓడిపోతుందన్నారు. అదే విధంగా వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ పాసిం సునీల్ కుమార్ ను వైసిపి ఎంఎల్ఏగానే చెప్పటం కూడా విచిత్రంగా ఉంది. ఎంఎల్ఏ వైసిపి తరపునే గెలిచినా చాలా కాలం క్రితమే టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే.
చంద్రబాబే సర్వే చేయించారా ?
ఇదిలావుంటే మంత్రివర్గంలోని మిగిలిన వాళ్ళని వదిలిపెట్టి ఒక్క గంటా శ్రీనివాస్ విషయంలో మాత్రమే సర్వే చేయటంతో మంత్రివర్గంలో వివాదం మొదలైంది. నిజానికి మంత్రివర్గంలోని చాలమందిపై అనేక ఆరోపణలున్నాయి. చాలామందిపై జనాల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. అటువంటిది ఒక్క గంటాపైన మాత్రమే సర్వే చేయించటంలో అర్ధమేంటి ? ఆ విషయంపైనే గంటా మండిపోతున్నారు. సర్వేకి తమకు ఏమీ సంబంధం లేదని సదరు మీడియా చెప్పుకుంటున్నా గంటా మాత్రం ఆ సర్వేని చంద్రబాబునాయుడే చేయించాడని ఆరోపిస్తున్నారు.
భీమిలీలోనే ఎందుకు సర్వే చేశారు ?
ఉద్దేశ్యపూర్వకంగా తనను గబ్బు పట్టించేందుకే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో సర్వే చేయించినట్లు అనుమానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా ఓటమి తప్పదంటూ సర్వేలో తేలిందని మీడియా చెబుతోంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గంటా ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఎప్పుడూ పార్టీ నేతలపైనో లేకపోతే పార్టీ ఓట్లపైనో ఆధారపడలేదు. ప్రతీ ఎన్నికలోనూ ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. అలాగే, ప్రతీ ఎన్నికలోనూ కొత్త పార్టీ తరపున పోటీ చేస్తారు. ఇప్పటి వరకూ పోటీ చేసిన నాలుగు ఎన్నికల్లో కూడా ఓటమి ఎరుగరు. అంటే గంటా తన సొంత నెట్ వర్క్ పైనే ఆధారపడతారన్న విషయం స్పష్టమైపోతోంది. రేపటి ఎన్నికల్లో ఏమవుతుందన్నది వేరే విషయం.
టిడిపికి గంటా పోటు తప్పదా ?
ఈ నేపధ్యంలోనే గంటా చంద్రబాబుపై మండిపోతున్నారు. అందుకనే మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరుకాలేదట. గురువారం చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పర్యటనలో కూడా పాల్గొనేది అనుమానమే అంటున్నారు. ఎందుకంటే, తన రాజకీయ భవిష్యత్తుపై బుధవారం గంటా తన మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నారట. వచ్చే ఎన్నికల్లో గంటా జనసేన లేదా వైసిపి తరపున పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్కడా టిక్కెట్టు దొరక్కపోతే చివరకు బిజెపి నుండైనా పోటీ చేయగల సమర్ధుడే. మెగా కుటుంబంతో తనకున్న సన్నిహితం కారణంగా త్వరలో గంటా జనసేనలో చేరనున్నట్లు చంద్రబాబుకు సమాచారం ఉందట. అందుకనే ఇప్పటి నుండే గబ్బు పట్టిస్తున్నారనే అనుమానం గంటాలో మొదలైంది. సరే గంటా భవిష్యత్తు ఎలాగున్నా వచ్చే ఎన్నికల్లో టిడిపికైతే దెబ్బ తప్పదని అప్పుడు ప్రచారం మొదలైపోయింది.