వైసిపి అధ్యక్షుడు జగరన్మోహన్ రెడ్డి బాగా పని చేస్తున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరర్రావు చెప్పారు. పాదయాత్ర చేయటం ద్వారా జనాల్లో వైసిపి నిలదొక్కుకున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటేశ్వర్ర రావు భార్య పురేంధేశ్వరి బిజెపిలో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది జగన్ భేష్ అని వెంకటేశ్వరరావు అనటంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి అటు జగన్, చంద్రబాబుతో పాటు సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా సమస్యలపై జగన్ చక్కగా స్పందిస్తున్నట్లు దగ్గుబాటి చెప్పారు.
ఖరీదైపోయిన రాజకీయాలు
అదే సమయంలో చంద్రబాబు వైఫల్యాలపై కూడా దగ్గుబాటి స్పందించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాజధానికి పచ్చని పంట భూములు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలని చురకలేశారు. ఎన్నికలు చాలా కాస్ల్టీ అయిపోయిందన్నారు. అసెంబ్లీ నియోజవర్గంలో పోటీ చేయాలంటే కనీసం రూ. 25 కోట్లు వ్యయం చేయాలట. తన భార్య పురంధేశ్వరి రాజకీయాలకు తనకు సంబంధం లేదన్నారు. ఎందుకంటే, తాను రాజకీయాల నుండి చాలా కాలం క్రితమే తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
పోలవరాన్ని కేంద్రమే తీసుకోవాలి
ఎన్నికల్లో డబ్బు పంపిణీకి తాను దూరమన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లు డబ్బు తీసుకున్నా తమ ఆలోచనలకు అనుగుణంగానే ఓట్లు వేస్తారని చెప్పారు. ప్రస్తు రాజకీయాల్లో ఇమడలేకే తాను దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. అధికారపార్టీ చేస్తున్న తప్పులను, మోసాలను ప్రధాన ప్రతిపక్షం ఎత్తి చూపుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో ఓట్ల కోసమే నాటి పాలకులు పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రజాధనం కూడా వృధా చేస్తున్నట్లు మండిపడ్డారు. కేంద్రం పరిధిలోని పోలవరం ప్రాజెక్టును రాష్ట్రపరిధిలోకి ఎందుకు తీసుకున్నారంటూ చంద్రబాబును నిలదీశారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తే బాగుంటుందని కూడా సూచించారు.