ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇంకో పక్కన ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయి. దాంతో ఎన్నికల్లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలోనూ పెరిగిపోతోంది. నేతల మధ్య విభేదాలు ఒక నియోజకవర్గానికో పరిమితం కాలేదు. దాదాపు ఏడు నియోజకవర్గాల్లో గొడవలుండటం గమనార్హం. ఈ విభేదాలు లోకేష్ పర్యటనలో స్పష్టంగా బయటపడటంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.
దామచర్లపై మండిపోతున్న ఆమంచి
ఇంతకీ విషయం ఏమిటంటే, సోమ, మంగళవారాల్లో నారా లోకేష్ పర్యటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పర్యటనల్లో నేతల వ్యవహారం ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా సాగింది. చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు దామచర్ల ఆంజనేయులు మధ్య ఉన్న విభేదాలు లోకేష్ దృష్టకి కూడా వచ్చాయని సమాచారం. లోకేష్ చీరాల పర్యటన సందర్భంగా ఆమంచి తాను, లోకేష్ ఉన్న పెద్ద ఫ్లెక్సీలను పట్టణమంతా ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల్లో మొహమాటానికి కూడా జిల్లా అధ్యక్షుడి ఫొటో ఎక్కడా కనిపించలేదు. తనను కాదని జిల్లా అధ్యక్షుడు పాలేటి రామారావు, ఎంఎల్సీ పోతుల సునీతను ప్రోత్సహిస్తున్నారన్నది ఆమంచికి కోపం.
ఇదే విషయమై ఇద్దరికీ మధ్య చాలా సార్లు గొడవే జరిగింది. అయినా వివాదం సద్దుమణగలేదు. ఫ్లెక్సీల్లో, పత్రికా ప్రకటనల్లో బిసి నేత నూకసాని బాలాజీ ఫొటోలు వేసిన ఆమంచి జనార్ధన్ ఫొటోలు మాత్రం కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే విషయం లోకేష్ వద్ద ప్రస్తావన వచ్చిందట. గొడవలెన్ని ఉన్నా పొటోలు మాత్రం వేసేవారు. ఆమంచి చేసిన పనితో దామచర్ల అనుకూల వర్గం ఆమంచిపై మండిపోతుండగా వ్యతిరేక వర్గం మాత్రం యమా సంతోషంగా ఉంది. సరే దామచర్ల మనసులో ఏముందో తెలీదుకానీ లోకేష్ తో పాటు చీరాల పర్యటనలో యధావిధిగా పాల్గొన్నారు లేండి.
చాలా నియోజకవర్గాల్లో గొడవలే
ఇక, పాలేటి రామారావు, పోతుల సునీతతో కూడా ఆమంచికి ఏమాత్రం పడదు. అదే విధంగా అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం-గొట్టిపాటి రవిల మధ్య ఉన్న గొడవల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వీళ్ళ మధ్య ఉప్పు నిప్పు. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయటానికి చంద్రబాబునాయుడు వల్లే సాధ్యం కాలేదు. అదేవిధంగా దామచర్లకు ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఏమాత్రం పడటం లేదు. ఇక, గిద్దలూరులో ఫిరాయింపు ఎంఎల్ఏ ముత్తముల అశోక్ రెడ్డి టిడిపి నేతలకు మధ్య ప్రతీరోజు గొడవలే. యర్రగొండపాలెంలో ఫిరాయింపు ఎంఎల్ఏ డేవిడ్ రాజును టిడిపి నేతలు ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్ళటం లేదు.
మంత్రుల వల్లే సయోధ్య కాలేదు
ఇన్చార్జి మంత్రి నారాయణ మాటలను జిల్లాలోని పలువురు ఎంఎల్ఏలు ఏమాత్రం లెక్క చేయటం లేదు. నేతల మధ్య సయోధ్య చేయటానికి నారాయణతో పాటు పరిటాల సునీత కూడా ప్రయత్నించి చేతెలెత్తేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తనను తప్పించమని నారాయణ స్వయంగా చంద్రబాబు తో చెప్పుకున్నారంటేనే జిల్లా పరిస్దితి ఎలాగుందో అర్ధమైపోతోంది. ఎన్నికలకు ఏడాదుండగానే పరిస్దితి ఇంత ఘోరంగా ఉంటే రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపు విషయం వచ్చేసరికి ఇంకెంత స్ధాయిలో గొడవలవుతాయో అంటూ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.