జనాలను మోసాలు చేయటంలో చంద్రబాబునాయుడు పిహెచ్ డి చేశారని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బుధవారం రాజోలు నియోజకవర్గంలో పెద్ద సభ జరిగింది. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ జనాలను మోసం చేయటం చంద్రబాబుకు చాలా తేలకన్నారు. పోయిన ఎన్నికల్లో చేసిన 600 హామీలలో ఎన్నింటిని నెరవేర్చారో చెప్పాలంటూ జనాలను అడిగి సమాధానం రాబట్టారు.
కాపులను బిసిల్లో చేర్చారా ?
అదేవిధంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన కాపులను బిసిల్లో చేర్చటంపై కూడా జగన్ ప్రస్తావించారు. కాపులను బిసిల్లోను, బోయలను ఎస్టీల్లోను చేరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తన హమీలను ఏ విధంగా తుంగలో తొక్కారో వివరించారు. కాపులను బిసిల్లోకి చేర్చేందుకు మంజూనాధ కమీషన్ వేసిన తర్వాత అధికారికంగా కమీషన్ నివేదిక అందకుండానే అసెంబ్లీ తీర్మానం చేయించిన సంగతిని గుర్తు చేశారు.
ప్రతీ ఇంటికో బెంజికారు
తాజాగా నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు మండిపడిన ఘటనను కూడా ప్రస్తావించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయాలని నాయీ బ్రాహ్మణ సంఘాల్లోని నేతలు అడిగినందుకే వారి తాట తీస్తానంటూ చంద్రబాబు మండిపడ్డారంటూ ధ్వజమెత్తారు. అవసరానికి వాడుకోవటం తర్వాత వదిలేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు ప్రతి ఇంటికి ఓ బెంజికారు, కెజి బంగారం ఇస్తానంటూ హామీ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. మొత్తం మీద జగన్ ప్రసంగించిన సుమారు 40 నిముషాలపాటు జనాలు కేరింతలతో సానుకూలంగా స్పందించటం గమనార్హం.