ప్రజాపోరాట యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు సూటిగా..స్పష్టంగానే చేశారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇది సాధ్యమైంది కూడా.కానీ, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శించినట్లు ఇంటర్వెల్స్ ఎక్కువ సినిమా తక్కువ అన్న చందంగా రాజకీయాలు చేస్తే ముందుకు సాగటం కష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
పైగా సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోనే జరగటం పక్కా అనే అభిప్రాయం బలంగా ఉంది. అంటే ఇంకా ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. మరి పవన్ రాష్ట్రంలో తన పర్యటనను ఎప్పుడు పూర్తి చేసుకుంటారు. 175 సీట్లలో అభ్యర్ధుల ఖరారు ఎప్పుడు పూర్తి చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే, అసలు పవన్ స్ట్రాటజీ ఏంటా అన్న అనుమానం రేకెత్తుతోంది.బహుశా ఆఖరి నిమిషంలో ఈసారి కూడా పోటీ చేయడం లేదని ప్రకటిస్తాడా అన్న అనుమానం కలుగుతోంది.గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారన్నది అంతుపట్టడం లేదు.