ఒకళ్ళని ఒకసారి మాత్రమే మోసం చేయొచ్చనే నానుడి తెలుగులో బాగా ఫేమస్. ఆ నానుడి చంద్రబాబుకు బాగా అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపారు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది మళ్ళీ హామీలు మొదలుపెట్టటం పలువురుని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నాయీ బ్రాహ్మణులు, రజకులను ఎస్సీల్లో చేరుస్తానంటూ హామీ ఇచ్చారు. సాధ్యాసాధ్యాల కోసం ప్రత్యేకించి ఓ కమిషన్ వేస్తారట. సామాజిక వర్గాల హోదాపై అధ్యయనం కోసం ఆ కమీషన్ పని చేస్తుందట. సదరు కమీషన్ నివేదిక ఆధారంగానే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తానంటూ తాజాగా సరికొత్త డ్రామా మొదలుపెట్టారు.
వివాదంతో డ్యామేజ్ అయిన ఇమేజి
నాలుగు రోజుల క్రితం నాయీ బ్రాహ్మణులతో సమావేశం జరిగిన సందర్భంగా పెద్ద వివాదం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. కనీసవేతనాలు అమలు చేయమని అడిగినందుకు వారిపై చంద్రబాబు ఫైర్ అయిపోయారు. దాంతో అన్నీ వైపుల నుండి చంద్రబాబు వైఖరిపై పెద్దస్ధాయిలో విమర్శలు, ఆరోపణలు ముసురుకున్నాయి. దాంతో డ్యామేజీ కంట్రోల్ కోసం కొత్త పల్లవి అందుకున్నారు. నాయీ బ్రాహ్మణులను ఎస్సీలో చేర్చేందుకు ఓ కమీషన్ వేస్తానని చెప్పారు. నిజానికి ఓ కులాన్ని రిజర్వేషన్ క్యాటగిరిలో చేర్చాలన్నా, తొలగించాలన్నా రాష్ట్రాల చేతిలో లేదన్న విషయం తెలిసిందే. అయినా ఆచరణ సాధ్యం కాని హామీలనిచ్చి మళ్ళీ లబ్దిపొందాలన్న ఆలోచనే తప్ప మరొకటి కనబడటం లేదు.
కాపులు, బోయలకిచ్చిన హామీలేమయ్యాయ్ ?
పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లోకి, బోయలను ఎస్టీ రిజర్వేషన్లలోకి చేరుస్తానంటూ హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ హమీ ఎంత వరకూ నెరవేరిందో అందరూ చూసిందే . అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన హామీని పూర్తిగా పక్కనపెట్టేశారు. దాంతో కాపుల్లో ఆందోళన మొదలైంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనలతో చంద్రబాబులో ఒత్తిడి పెరిగింది. అందుకనే హడావుడిగా మంజూనాధ కమీషన్ వేయటం, నివేదికను కేంద్రానికి పంపటం లాంటి డ్రామాలు అందరికీ తెలిసిందే. బోయలను ఎస్టీల్లోకి చేర్చటం కూడా అటువంటిదే సేమ్ టు సేమ్ డ్రామా.
తాజా హామీని జనాలు నమ్ముతారా ?
అసెంబ్లీ తీర్మానాలను కేంద్రం ఆమోదించదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే కేంద్రానికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు. అప్పటి నుండి కేంద్రంపై ఆరోపణలు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. మళ్ళీ ఎన్నికలొస్తున్న నేపధ్యంలోనే వచ్చేసారి ఏం హామీలివ్వాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నాయీ బ్రాహ్మణులతో గొడవ బాగా హైలైట్ అయ్యింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఓ కమీషన్ అంటూ సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. ఎందుకంటే, నాలుగేళ్ళుగా నాయీ బ్రాహ్మణుల సమస్యలపై ఏనాడూ ఆలోచన కూడా చంద్రబాబు ఆలోచించలేదన్నది వాస్తవం. అటువంటిది హటాత్తుగా రజకులు, నాయీ బ్రాహ్మణులను ఎస్సీల్లోకి చేర్చటానికి ఓ కమీషన్ అంటే డ్రామాలు కాక మరేంటి ? కాకపోతే చంద్రబాబు డ్రామాలు వచ్చే ఎన్నికల్లో వర్కవుటవుతాయా అన్నదే చూడాలి ?