ఆయనేమీ ప్రజా ప్రతినిధి కాదు. ఎందుకంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. అయినా తెలుగుదేశంపార్టీలో కీలక నేత అనుకోండి. ఆయనెవరో ఈపాటికే మీకు అర్దమైఉంటుంది. అవునే, ఆయనే రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్. ఇదంతా ఇపుడెందుకంటే, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశంపార్టీ, వైసిపి దీక్షలు మొదలయ్యాయి. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష కు దిగితే, వైసిపి ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి 48 గంటల దీక్షకు కూర్చున్నారు.
దీక్షపై అందరిలోనూ అనుమానాలు
ప్రసాద్ రెడ్డి దీక్షలో కూర్చున్నారంటే అర్ధముంది. మరి, సిఎం రమేష్ ఎందుకు ఏకంగా ఆమరణ నిరాహార దక్షకు దిగారు ? ఇక్కడే అందరిలోనూ అనుమానలు మొదలయ్యాయి. సరే ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయటం, ప్రజా ప్రతినిధులు ఆందోళనలు చేయటం హర్షణీయమే. అందులో భాగమే అధికార, ప్రధాన ప్రతిపక్షాల పోటీ దీక్షలు. సిఎం రమేష్ దీక్షకు దిగినపుడున్న హడావుడి మధ్యాహ్నం తర్వాత కనిపించలేదట. ఎందుకంటే, దీక్ష ప్రారంభానికి హాజరైన నేతలంతా తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారట.
దీక్షకు దిగటంపై జిల్లాలో చర్చ
ఇంతకీ విషయం ఏమిటంటే, కడప జిల్లాలో ప్రస్తుతం టిడిపికి చాలా మంది నేతలేఉన్నారు. వాళ్ళంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికార పదవుల్లో ఉన్నవాళ్ళే. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డి, ఎంఎల్సీలు రామసుబ్బారెడ్డి, బిటెక్ రవి లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళంతా ప్రజాబలమున్న వాళ్ళే అనటంలో సందేహం అక్కర్లేదు. అయితే, అంతమంది నేతలున్న జిల్లాలో ఎటువంటి ప్రజాబలం లేని ఓ నేత ఆమరణ నిరాహార దీక్షకు దిగటంపైనే జిల్లాలో చర్చ జరుగుతోంది.
జిల్లాలోని ఏ నేతతోనూ సఖ్యత లేదు
సిఎం రమేష్ అనే నేత ఎప్పుడూ నేరుగా ప్రజల ద్వారా ఏ పోస్టుకు కూడా ఎన్నికవ్వలేదు. దొడ్డిదోవ రాజకీయాల ద్వారా చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయి రాజ్యసభ సభ్యుడైపోయారు. దీక్షల వల్లో లేకపోతే ఇతర కారణాల వల్లో కేంద్రం కడపలో ఉక్కు ఫ్యాక్టీరీని మంజూరు చేసినా టిడిపికి ఎంత వరకూ లాభిస్తుందో ఎవరికీ అర్దం కావటం లేదు. ఎందుకంటే జిల్లాలోని చాలా మంది నేతలతో రమేష్ కు అసలు పడటంలేదు. పైగా ప్రజాబలం లేని నేత కాబట్టి ఎవరినీ వచ్చే ఎన్నికల్లో గెలిపించేంత సత్తా కూడా లేదు. ఎంతసేపూ గెస్ట్ హౌస్ లో కూర్చుని మంతనాలు చేయాల్సిందే. రేపటి ఎన్నికల్లో పోటీ చేసే వారెవరైనా దీక్షలో కూర్చునుంటే ఉపయోగం ఉండేదేమో ?
టిడిపి నుండే కరువైన మద్దతు
రమేష్ సత్తా తెలిసిన నేతలు కాబట్టే ఆయన దీక్షకు ఎవరూ పెద్దగా మద్దతు పలకలేదు. చంద్రబాబు పిలుపిచ్చారు కాబట్టి ఏదో మొక్కుబడిగా దీక్ష సమయానికి హాజరై తర్వాత మాయమైపోయారు. ఇక, దీక్షలో కూర్చోవటమంటారా ? రమేష్ దీక్ష వెనుక ఏదో మతలబే ఉందన్నది అందరి అనుమానం. బేసికల్ గా రమేష్ వ్యాపారి. 'లాభం లేందే వ్యాపారి వరదన కూడా పోడ'నే సామెతను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.