రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లుగా సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సభ్యులే కొనసాగతున్నారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జూలై 2న పదవీ విరమణ పొందనున్నారు. ఖాళీ అవుతున్న పదవికి ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను కొనసాగిస్తుందా..? లేదా అన్నది ఇప్పుడు దేశ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే గతంలో ఉన్న పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే ఈసారి కూడా విపక్షాలను కూడగట్టి తన అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్గా గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఇక్కడే ఆ పార్టీ అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మద్దతు పొందడం అనేది ఆ పార్టీ నేతలకు పెద్ద సవాలుగా మారింది.
ఇదే సమయంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తమ పార్టీ నుంచి బరిలోకి దింపుతామని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలన్నీ తమ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలనే డిమాండ్ను ఆమె ముందుకు తెస్తున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు పొందేందుకు ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఏస్కు మద్దతు తెలిపింది. 80 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కూడా 38సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. కేవలం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల విషయంలోనూ మమతా బెనర్జీ డిమాండ్కు ఒప్పుకోకుంటే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్ష కూటమికి నాయకత్వం వహించే అవకాశం రాకపోవచ్చుననే భయం కూడా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. మరోవైపు సొంత పార్టీ నేతల అవకాశాలను ఇతరులకు అప్పనంగా అప్పగించడంపై కూడా పార్టీ వర్గాల్లో కొంత అసంతృప్తినెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు బీజేపీయేతర పక్షాల కూటమి భవిష్యత్ను నిర్ణయిస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ పట్టువిడుపులకు పోతే.. అసలుకే మోసం వచ్చే పరిస్థితులూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
రాజ్యసభలో మొత్తం 245మంది సభ్యులు ఉన్నారు. గెలవడానికి 122 ఓట్లు అవసరం. డిప్యూటీ చైర్మన్ను కేవలం రాజ్యసభ సభ్యులే ఎన్నుకుంటారు. అయితే బీజేపీకి సొంతంగా 69మంది ఎంపీలు ఉన్నారు. ఇక మిత్రపక్షాలు, స్వతంత్రులు, నామినేటెడ్ ఎంపీలు, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు చెందిన 13మంది సభ్యులతో కలిపి ఎన్డీయేకి మొత్తం 111ఓట్లు వస్తాయి. విపక్షం వద్ద టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీలతో కలిపి మొత్తం 117ఓట్లు ఉన్నాయి. వీటికి బీజేడీ(9), టీఆర్ఎస్(6), వైసీపీ(2)ల ఓట్లు తోడైతే 134కు చేరుతుంది సంఖ్య. అయితే ఈ మూడు పార్టీల ఓట్లే అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి మద్దతు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితరులతో కూడిన విపక్షం ప్రయత్నం చేస్తున్నాయి.