ఎన్నికల లోపే కడప జిల్లాలోని స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేస్తారట. అలాగని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయడు చెబుతున్నారు. ఏ సమాచారంతో నాయుడు చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే, రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి జాతీయ నాయకత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడి కాని పూర్తిగా గాలికొదిలేసిన విషయం అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తులు కంటిన్యూ చేయాలని అనుకున్నా లేదా ఒంటిరిగా పోటీ చేయాలని అనుకున్నా అది పూర్తిగా బిజెపి ఇష్టమే. కాకపోతే ఏ పద్దతిలో పోటీ చేయాలని అనుకున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరమైతే కేంద్రానికి ఉంది కదా ?
ఎన్ని అబద్దాలు చెప్పిందో
విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రత్యేకహోదా ఇవ్వలేదు. హోదా విషయంలో కేంద్రప్రభుత్వం ఎన్ని పిల్లి మొగ్గలేసిందో అందరూ చూసిందే. పిల్లి మొగ్గలేయటమే కాకుండా పూర్తిగా అబద్దాలు చెప్పింది. దేశంలో హోదా ఎవరికీ ఇచ్చేది లేదని చెప్పిన తర్వాత ఇప్పటికే హోదాను అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు పొడిగించిన సంగతి ఏపి జనాలు ఎలా మరచిపోగలరు ? ఏపిపై కేంద్రానికి నిజంగానే అంత శ్రద్దుంటే మరి అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటి ?
ఏపి విషయంలో చిత్తశుద్ది ఉందా ?
అదే సమయంలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశం మాటేంటి ? రైల్వేజోన్ అంశం ఈనాటిది కాదు. దశాబ్దాల నాటి డిమాండ్. ప్రధానమంత్రి ఒకసారి తలచుకుంటే చాలు రాష్ట్ర ప్రయోజనాలు వాటంతట అవే వచ్చి పడతాయి. నిజంగానే వచ్చే ఎన్నికల్లో బిజెపికి నాలుగు సీట్లు రావాలని జాతీయ నాయకత్వం అనుకుని ఉంటే ఒక్క డిమాండ్ అయినా తీర్చకుండానే ఉంటుందా ? ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రానికి నిజంగానే చిత్తశద్ది ఉంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో పార్టీలు దీక్షలు చేయాలని పనేంటి ?
ఏపి విషయంలో ఆశలు వదిలేసిందా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తమకు ఒక్క సీటు కూడా రాదని బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకనే పార్టీల ఏ డిమాండ్ ను కూడా పట్టించుకోవటం లేదు. అలాగని నేరుగా ఆ విషయాన్ని చెప్పటం లేదు. ఇక్కడే బిజెపి రాజకీయం ఆడుతోంది. అయితే, జనాలు తెలివి తక్కువ వాళ్ళేమీ కాదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని ఎక్కడ ఉంచాలో వాళ్ళకు బాగా తెలుసు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేయటం చూస్తే ఇంకో ఏడాది పాటు ఈ డ్రామాను కంటిన్యూ చేస్తారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. కడప ఉక్కు పరిశ్రమకు ప్రధాని శంకుస్ధాపన చేస్తారట. నెల రోజుల్లో తేదీ కూడా ప్రకటిస్తారట. ఎటూ ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేయనున్నారని తెలిసే టిడిపి దీక్షల డ్రామాలుడుతోందంటూ నాయడు మండిపడ్డారు.