కడప జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడుక్కెతోంది. ఎప్పుడైతే ప్రత్యేకహోదా డిమాండ్ తో కడప, రాజంపేట ఎంపిలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందాయో వెంటనే జిల్లాలోని వైసిపి ఎంఎల్ ఏ లు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో రాజీనామాలకు సిద్ధపడ్డారు. దాంతో చంద్రబాబుపై ఒత్తిడి మొదలైంది. చంద్రబాబునాయుడుపై వైసిపి వ్యూహాత్మకంగా ఒత్తిడి తెస్తోంది. ప్రత్యేకహోదా డిమాండ్ తో రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకున్న ఎంపిల బాటలోనే ఎంఎల్ఏలు కూడా నడవాలని నిర్ణయించుకున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇటు టిడిపి అటు వైసిపి దీక్షలకు దిగిన సంగతి అందరూ చూసిందే. ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోగా వైసిపి ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి 48 గంటల దీక్ష చేశారు.
రాజీనామాలకు సిద్దపడ్డ ఎంఎల్ఏలు
దీక్షలతో అటు కేంద్రప్రభుత్వంతో పాటుఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగానే కడప జిల్లాలోని వైసిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటానికి సిద్దమవుతున్నారు. ఎంఎల్ఏ దీక్షలో ఉండగానే ఎంపిల రాజీనామాలు ఆమోదం పొందటంతో వెంటనే ఎంఎల్ఏల రాజీనామాల విషయాన్ని ఎంఎల్ఏల్లో ఆలోచన వచ్చిందట. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 సీట్లలో వైసిపి 9 చోట్ల గెలవగా టిడిపి ఒక్క స్ధానంలో విజయం సాధించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జమ్మల మడుగు, బద్వేలు ఎంఎల్ఏలు ఆది నారాయణరెడ్డి, జయరాములు టిడిపిలోకి ఫిరాయించారు. దాంతో వైసిపి బలం ఏడుక పడిపోయింది.
రాజీనామాలపై టిడిపికి సవాల్
ఇదే అంశంపై దీక్ష తర్వాత రాచమల్లు మాట్లాడుతూ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ తో జిల్లాలోని ఏడుగురు వైసిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. టిడిపికి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు రాజీనామాలు చేయటానికి సిధ్ధంగా ఉన్నారా అంటూ సవాలు విసిరారు. అంటే సవాలును స్వీకరించటానికి టిడిపిలో ఎవరూ సిద్దంగా లేరనుకోండి అది వేరే సంగతి. జిల్లాలోని రెండు పార్టీలకు చెందిన మొత్తం 13 మంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే కేంద్రప్రభుత్వానికి క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అర్ధమవుతాయని రాచమల్లు చెప్పటం గమనార్హం. రాజీనామా లేఖల్లో ముందు తమ ఎంఎల్ఏలే సంతకాలు చేస్తామనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు లేండి. అయినా వైసిపి సవాళ్ళకు టిడిపి ఎప్పుడు అంగీకరించిది గనుక ఇపుడు అంగీకరించటానికి ?