చూడబోతే అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. అధికారంలో ఉండి ప్రతిపక్ష నేతలను చీల్చి చెండాల్సిన చంద్రబాబు స్వయంగా తానే ప్రతిపక్షాలకు ఆయుధాలను అప్పగించి ఎదురు దెబ్బలు తింటున్నారు. కేంద్రం వ్యవహారం కావచ్చు, రాష్ట్రంలోని వ్యవహారాలు కావచ్చు. లేదా చంద్రబాబు వైఖరి కూడా అందుకు దోహదపడుతున్నాయి. సందర్భం ఏదైనా, విషయం ఏదైనా ప్రధాన ప్రతిపక్షం వైసిపితో పాటు ప్రతిపక్షాలన్నీ ఏకధాటిగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నాయంటే అది కేవలం సిఎం స్వయంకృతమనే చెప్పాలి. తాజాగా నాయీబ్రాహ్మణులతో సిఎం వ్యవహరించిన తీరునే తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
జగన్ వల్లే హోదా డిమాండ్ సజీవంగా
ఎన్డీఏతో తెగ తెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు లో ఏదో మార్పయితే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎలాగంటే, బిజెపితో కాపురం చేసినంత కాలం తప్పులుగా కనిపించిన ప్రతీ విషయం తెగతెంపుల తర్వాత ఒప్పులుగా కనబడుతున్నాయి. అందుకు ప్రత్యేకహోదా, కడపలో స్టీలు ఫ్యాక్టరీ, విశాఖపట్నం రైల్వేజోన్ అంశాలే మంచి ఉదాహరణలు. నాలుగేళ్ళపాటు రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యేకహోదా గురించి మాట్లాడితే మహాపాపమన్నట్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆందోళనలు, కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు తప్పవని బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. రైల్వేజోన్, కడప స్టీలు ఫ్యాక్టరీ గురించి కూడా పెద్దగా మాట్లాడలేదు.
హోదా డిమాండ్ పై ఎంత బిల్డప్ ఇస్తున్నారో ?
అయితే, ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి వచ్చేశారో వెంటనే ప్రత్యేకహోదా నినాదాన్ని అందుకున్నారు. నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా గురించి కేంద్రంతో పోరాడుతున్నది తానే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు. ఇపుడు చంద్రబాబు రెండు అంశాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. మొదటిది హోదా పోరాట క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవటం. రెండోది బిజెపి, వైసిపిలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని జనాలను నమ్మించటం. రెండు విషయాల్లోనూ చంద్రబాబు ఎంత సక్సెస్ అవుతారన్నది జనాలు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది.
ప్రతీ అంశాన్ని తిప్పికొడుతున్న జగన్
చంద్రబాబు మాట్లాడే ప్రతీ విషయాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకుని తిప్పి కొడుతున్నారు. హోదా గురించి మొదటి నాలుగేళ్ళు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పాదయాత్రలో ప్రతీ చోటా జనాలకు వివరిస్తున్నారు. అలాగే, కాపులను బిసిల్లో, బోయలను ఎస్టీల్లోకి మారుస్తానని చేసిన హామీ గురించి ప్రస్తావిస్తున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ తీరుపైన కూడా తనదైన శైలిలో చంద్రబాబుపై జగన్ విరుచుకుపడుతున్నారు.
ఎక్సైపైరీ డేట్ లేని ఆరోపణలు
చంద్రబాబు వైఫల్యాలపై జగన్ ప్రస్తావిస్తున్న ఏ అంశానికీ ఎక్సైపైరీ డేట్ అన్నదే లేదు. వచ్చే ఎన్నికల వరకూ చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే జగన్ ప్రస్తావిస్తున్న అంశాలు జనాల్లోకి ఎంత వరకూ ఎక్కుతోందన్నదే సందేహం. తన శక్తివంచన లేకుండా చంద్రబాబు వైఫల్యాలను జగన్ జనాల్లోకి తీసుకెళుతున్నారు. మరి, అదే స్ధాయిలో పార్టీలోని నేతలందరూ కష్టపడుతున్నారా అంటే లేదనే సమాధానం చెప్పుకోవాలి. సమయం, సందర్భం వచ్చినపుడు మాత్రమే నేతలు జనాల్లోకి వెళుతున్నారు లేకపోతే ఎవరిదారి వారిదే అన్నట్లుంటున్నారు. మరి వైసిపి కష్టం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.