అదేంటో జిల్లాలో ఎక్కడా లేనట్లుగా భీమునిపట్నం (బీమిలి) సీటు హాట్ ఫేవరేట్ అయింది. ఇద్దరు టీడీపీ ముఖ్యులూ ఒకే సీటు కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ చిక్కు ముడి విప్పడం హై కమాండ్ వల్ల కావడంలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా వున్నారు. వచ్చే ఎన్నికలలో ఈ సీటును అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరుకుంటున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం టైం లో భీమిలి నుంచే తొలిసారి గెలిచారు. ఆ సెంటిమెంట్ తో పాటు ఈసారి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి మంత్రి పదవి కొట్టేయాలన్నది ఎంపీ ప్లాన్. సిట్టింగ్ ఎంఎల్ఏ హోదా కాబట్టి మరోమారు ఇక్కడ నుండే పోటీ చేయాలని గంటా అనుకుంటున్నారు. దీంతో ఇద్దరు శ్రీనుల మధ్య యుద్ధం స్టార్ట్ అయిపోయింది.
ఎవరినీ వదులుకోలేక
నిజానికి భీమిలీ సీటు ముత్తంశెట్టికి వచ్చే ఎన్నికలలో ఇస్తానని చంద్రబాబు ఈ మధ్యనే చెప్పారట. అనకాపల్లి ఎంపీ వైసీపీలోకి వెళ్తున్నాడని టాక్ తో ఖంగు తిన్న బాబు అయనను పిలిపించుకుని మాట్లాడిన సందర్భంలో భీమిలీ సీటుపై హామీ ఇచ్చేసారట. ఇది తెలుసుకుని గుర్రు మీదున్న గంటాకు ఏకంగా ఓడిపోతారంటూ సర్వే రావడంతో సీన్ అర్ధమై అలక పానుపు ఎక్కేసారు. గంటాను బుజ్జగించే క్రమంలో మంత్రి నిమ్మకాయల భీమిలీ సీటు గంటాదేనంటూ మీడియా సాక్షిగా డిక్లేర్ చేసేసారు.
ఇపుడు అలక రెండవ శ్రీనుది
తాజా పరిణామాలతో ఎంపీ ముత్తంశెట్టి అలక పానుపు ఎక్కేసారని టాక్. సీయం పిలిచి మరీ భీమిలీ సీటు ఆఫర్ చేస్తే మధ్యలో మంత్రి నిమ్మకాయల ఎవరు గంటాకు ఇవ్వడానికని ఎంపీ అనుచరులు గుస్సా అవుతున్నారు. మా నాయకుడికే భీమిలీలో గట్టి పట్టు వుందని, ఎట్టి పరిస్థితులలో ఆయన భీమిలీ నుంచే పోటీ చేస్తారంటూ హింట్ ఇస్తున్నారు. అంటే ఎంపీ వైసీపీలో చేరిపోతారని చెప్పకనే చెబుతున్నారన్నమాట.
చివరికి మిగిలేది ఎవరో ?
ఇద్దరు శ్రీనులనూ టీడీపీలో వుంచాలని చంద్రబాబు యత్నిస్తున్నా చివరకు ఎవరూ మిగిలేలా లేరన్నది హాట్ టాపిక్. గంటా ఇప్పటికైతే టీడీపీలో వున్నా ఎన్నికల నాటికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, మరో వైపు పార్టీకి నమ్మకంగా వున్న ముత్తంశెట్టి సైతం మారుతున్న పరిణామాల నేపధ్యంలో వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. బాబు రాజకీయ చాణక్యం కూడా ఇద్దరి ముందు పనిచేయటం లేదని సొంత పార్టీలోనే సెటైర్లు పడిపోతున్నాయి.