జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనంతట తానుగా జనాల విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే పవన్ పై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా చంద్రబాబుతో పవన్ భేటీ పైనే సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం నిధులు, రాజధాని లాంటి అనేక అంశాలపై ఉద్యమాలని, పోరాటాలని ఏవేవో చెప్పిన పవన్ ఒక్కసారిగా మాట మీద నిలబడలేదు. చెప్పింది చెప్పినట్లు చేసిందీ లేదు. దాంతో పవన్ పై జనాల్లో చులకనభావం వచ్చేసింది. పవన్ వ్యవహార తీరు కూడా అదే విధంగా ఉండటంతో జనాలు పవన్ ను పట్టించుకోవటం మానేశారు. పవన్ ఎప్పటికైనా చంద్రబాబు మనిషే అన్న అనుమానంతోనే జనసేన అధినేతను జనాలు తేలిగ్గా తీసుకున్నారు.
చంద్రబాబుపై ఆరోపణలు
ఇటువంటి నేపధ్యంలోనే ఒక్కసారిగా చంద్రబాబు, లోకేష్ పై పవన్ అవినీతి ఆరోపణలు చేయటంతో అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ ఏంటి చంద్రబాబు, లోకేష్ లపై ఆరోపణలు చేయటమేంటని అనుమానించారు. ఎందుకంటే, అప్పటి వరకూ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేసే ఆరోపణలకు కొన్ని సార్లు పవన్ కూడా కౌంటర్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అందుకనే జనాలు పవన్ ను నమ్మలేదు. అయితే, చంద్రబాబు, లోకేష్ లపై పవన్ ఆరోపణల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో నిజంగానే చంద్రబాబును పవన్ వ్యతిరేకిస్తున్నారేమో అనే భ్రమ జనాల్లో మొదలైంది.
జగన్ బాటలోనే పవన్ కూడా యాత్ర
ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వాన్ని, చంద్రబాబును వాయించేస్తున్నారు. అదే సమయంలో పవన్ కూడా ప్రజా పోరాట యాత్ర అంటూ ఓ యాత్ర మొదలుపెట్టారు. యధావిధిగా చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే, యాత్ర చేస్తానని చెప్పినన్ని రోజులు పట్టలేదు నిలిపేయటానికి. దీక్ష పేరుతో ఒకసారి, రంజాన్ పేరుతో రెండోసారి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. మొన్నటి 15 వ తేదీ బ్రేక్ నుండి యాత్ర మళ్ళీ మొదలుకాలేదు. ఏదో జగన్ యాత్ర చేస్తున్నాడు కాబట్టి తాను కూడా జనాల్లోకి ఏదో ఒక రూపంలో వెళ్ళాలన్న కోరిక తప్పితే జగన్ పట్టుదల పవన్ లో కనబడటం లేదు.
మాజీ ఎంపి పేల్చిన బాంబు
ఇంతలో వైసిపి మాజీ ఎంపి వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పవన్ మద్దతు జగన్ కే ఉంటుందని పెద్ద బాంబే పేల్చారు. ఆ విషయాన్ని పవనే తనకు స్వయంగా చెప్పారంటూ ప్రసాద్ చెప్పటంతో టిడిపి గుండెల్లో రైళ్ళు పరిగెట్టించింది. దాంతో అటు పవన్ ఇటు వరప్రసాద్ పై టిడిపి నేతలు ఒక్కసారిగా మాటల దాడి మొదలుపెట్టారు. ఆ నేపధ్యంలోనే వెంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చంద్రబాబు-పవన్ కలిశారు ఆ సందర్భంగా ఇద్దరూ ఏకాంతంగా సుమారు 20 నిముషాలు మాట్లాడుకున్నారు. ఆధ్యాత్మిక చర్చలు తప్ప రాజకీయాలు మాట్లాడలేదని టిడిపి వర్గాలు చెబుతున్నా నమ్మే వాళ్ళు ఎవరూ లేరులేండి.
రాజకీయ చర్చలకే అవకాశాలు ఎక్కువ
వాళ్ళిద్దరూ కేవలం ఆధ్యాత్మిక చర్చలు మాత్రమే మాట్లాడుకునేందుకు వాళ్ళేమైనా మఠాల్లోనో లేకపోతే పీఠాల్లోనో పనిచేస్తున్నారా ? కాబట్టి కచ్చితంగా రాజకీయాలే చర్చకు వచ్చి ఉంటాయనటంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి కావచ్చు, తనపై పవన్ అనుసరిస్తున్న వైఖరి గురించీ చంద్రబాబు ప్రస్తావించి ఉండవచ్చు. లేకపోతే బిజపి, వైసిపిల విషయంలో పవన్ వైఖరిపై చంద్రబాబు ప్రస్తావించి ఉండొచ్చు. తనకు మద్దతుగా నిలవకపోయినా పర్వాలేదు బిజెపి, వైసిపిలతో పొత్తులు పెట్టుకోవద్దని కూడా చంద్రబాబు పవన్ ను కోరి ఉండచ్చు. ఇలా ఏ అంశంపైనైనా వారిద్దరి మధ్య చర్చలు జరిగి ఉంటుందనటంలో సందేహం లేదు. నిజంగా ఆధ్యాత్మిక చర్చలే జరిగి ఉంటే అక్కడే ఉన్న మరికొందరిని కూడా వారు కూర్చున్న గదిలోకి ఆహ్వానించి ఉండొచ్చు కదా ? సరే, ఏదేమైనా ఇటువంటి చేష్టల వల్లే పవన్ జనాల్లో విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం.