దేశంలో ఈ మద్య మనుషులు మద్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నశించిపోతున్నాయి. హత్య చేయడం ఐస్ క్రీమ్ తిన్నంత సులువైంది. ఒక బిడ్డను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి కొంత మంది దుర్మార్గులు క్షణాల్లో నరకాన్ని చూపిస్తున్నారు. కంటికి రెప్పలా సాకుతున్న తమ పిల్లలు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు భయం భయంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. క్షణికావేశంతో జరిగే కొన్ని హత్యలు తర్వాత ఆలోచించినా..ఫలితం కనబడదు. తాజాగా గుజరాత్ లోని వడోదరలోని ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ బాలుడు వాష్రూమ్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలుడి మృతదేహంపై 10 కత్తి పోట్లు ఉన్నాయని చెప్పారు. గుజరాత్లోని వడోదరలో ఉన్న శ్రీ భారతి విద్యాలయలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఓ పదవ తరగతి విద్యార్థిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హతుడికి, నిందితుడికి మధ్య గురువారం గొడవైందని.. ఈ నేపథ్యంలో శుక్రవారం తన వెంట తెచ్చుకున్న ఆయుథంతో హత్య చేసి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్కూలు పరిసరాలు పరిశీలించిన పోలీసులకి.. సమీపంలోని ఓ గుడి వద్ద ఓ స్కూల్ బ్యాగ్లో పదునైన ఆయుధం, ఓ బాటిల్లో కారం కలిపిన నీళ్లు లభ్యమయ్యాయి.
దీంతో ఆ విద్యార్థితో ఘర్షణ పడి అదే స్కూల్లో చదువుతోన్న మరో బాలుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో స్కూల్లోని సీసీ కెమెరాల ఫూటేజ్లను పరిశీలిస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో గుర్గావ్లో 7 ఏళ్ల బాలుడు ఇదే రీతిలో వాష్రూమ్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.