వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి అనంతపురం జిల్లాలో ఏదో తేడా కొట్టేట్లే కనబడుతోంది. క్షేత్రస్ధాయిలోని పరిణామాలు చంద్రబాబు క్యాంపు ఆఫీసులో ఉన్నట్లు లేదు. ఎందుకంటే, జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ నేతల మధ్య ఏదో ఒక కుంపటి రగులుతోంది. దాంతో మంత్రులు కావచ్చు లేదా ఎంపి, ఎంఎల్ఏలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎల్ఏలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో 14 సీట్లలో ముగ్గురు కన్నా గెలవరని సాక్ష్యాత్తు ఎంపి జెసి దివాకర్ రెడ్డే బహిరంగంగా చెప్పిన తర్వాత పార్టీ పరిస్దితి ఎవరికైనా ఈజీగా అర్దమైపోతుంది.
నేతలతో విడివిడిగా భేటీలు
విషయంలోకి వస్తే క్యాంపు ఆఫీసులో చంద్రబాబు అనంతపురం జిల్లా నేతలతో చాలా సేపు సమావేశమయ్యారు. మంత్రులు ఎంపిలు, ఎంఎల్ఏలతో జరిగిన సమావేశంలో చంద్రబాబుకు పరిస్ధితి బాగానే అర్దమైఉండాలి. ఎందుకంటే, హోలు మొత్తం నేతలతో సమావేశం తర్వాత మళ్ళీ ఇద్దరు, ముగ్గురు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. జిల్లాలో పరిస్దితి బాగుంటే నేతలతో విడివిడిగా సమావేశం అవ్వాల్సిన అవసరం ఏముంటుంది ? నాలుగేళ్ళల్లో అనంతపురం జిల్లాకు ఎంతో చేశామని చంద్రబాబు చెబుతున్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసింది కూడా పార్టీ జనాలకు చెప్పుకోలేకపోతోందని మండిపడ్డారు.
14 నియోజకవర్గాల్లో 30 గ్రూపులు
తర్వాత నేతల మధ్య ఉన్న విభేదాలపైన కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంటే ఈ నిజాన్ని చంద్రబాబు ఆలస్యంగా గుర్తించినట్లు కనబడుతోంది. ఎందుకంటే, ఉన్న 14 నియోజకవర్గాల్లో 30 గ్రూపులున్నాయి. ఏ ఇద్దరు ఎంఎల్ఏలకు పడదు. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డితో ఏడుగురు ఎంఎల్ఏలకూ పడటం లేదు. మంత్రులకు, ఎంపికి పడదు. హిందుపురం ఎంపి నిమ్మల కిష్టప్పతో ఐదుగురు ఎంఎల్ఏలకు పొసగదు.
ఇతర పార్టీల వైపు నేతల చూపు
మొత్తం ఎంఎల్ఏల్లో హిందుపురం, మడకశిర, పుట్టపర్తి నియోజకవర్గాల్లో మాత్రం పార్టీలో గ్రూపుల సమస్య లేదు. కాకపోతే మడకశిర (ఎస్సీ) ఎంఎల్ఏ కె. ఈరన్న, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డిపై జనాలు మండిపోతున్నారు. జిల్లాలో పార్టీ పరిస్ధితి ఇంతలా దిగజారిపోవటానికి చంద్రబాబే కారణమని చెప్పాలి. ఎవరిని ఆదుపుచేయలేని కారణంగా ప్రతీ ఎంఎల్ఏ, ఎంపిలు ఎవరికి వారు స్వతంత్రులైపోయారు. దానికి తోడు ఆర్ధికంగా కూడా బలవంతులైపోవటంతో ఇపుడు చంద్రబాబు మాటను కూడా లెక్క చేయటం లేదు. ఎందుకంటే, ఒకపుడు చంద్రబాబు కాదంటే పోటీ చేసే అవకాశం లేదు. కానీ ఇపుడు పరిస్ధితి అదికాదు. చంద్రబాబు కాదంటే వైసిపి, జనసేన, బిజెపిలు టిక్కెట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. అందుకనే ఎవరికి కూడా టిక్కెట్లు ఇవ్వను అని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేకున్నారు.