నిన్నటి రోజున గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ లో ప్రతిష్టింపడ్డ దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం కార్యక్రమంలో పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్న సందర్భంలో తన పై వస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానాలు ఇచ్చాడు. గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న పవన్ చంద్రబాబులు ఒకే కార్యక్రమంలో పాల్గొన్న విషయమై పవన్ స్పందిస్తూ తన మర్యాదను అపార్ధం చేసుకోవద్దని కోరుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
‘రాజకీయ విభేదాలను నేను సిద్ధాంతాల పరంగానే చూస్తా వ్యక్తిగతంగా చూడను. ఇది లేకపోవడటం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేకపోయాయి' అని పవన్ అని చురకలు అంటించాడు. అంతేకాదు నాయకులు ఎవరైనా కలిసినప్పుడు మంచిచెడ్డలను అడిగి తెలుసుకోవడం ఒక మర్యాద అని అంటూ రాజకీయాలలో మర్యాద కోసం తాను పాటించే విలువలను తప్పుగా అర్ధం చేసుకోవద్దు అంటూ తన ట్విటర్ లో కామెంట్ చేసాడు పవన్.
అంతేకాదు విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయాలకు దూరంగా పారిపోవద్దని కోరుతూ తాను కూడ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసాడు పవన్. సగటు మధ్యతరగతి వ్యక్తి మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయే కంటే ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే రాజకీయాలలో మార్పులు వస్తాయి అంటూ అభిప్రాయపడ్డాడు జనసేన అధినేత.
అంతేకాదు మన జీవితాన్ని నిత్యం ప్రభావితం చేసే రాజకీయాలకు దూరంగా జరగొద్దని పవన్ పిలుపు ఇస్తూ ప్రజలు ప్రశ్నించడం మానివేస్తే జనం అంతా వెన్నెముక లేనివారుగా మారిపోయే ప్రమాదం ఉంది అంటూ పెచ్చరిస్తున్నాడు పవన్. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వర్గం పోరాడిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మధ్యతరగతి ఎదగాలని ఆశిస్తున్నాని రాజకీయాలలో వారి భాగస్వామ్యం అవసరం అంటూ పవన్ రాబోయే ఎన్నికలలో మధ్య తరగతి ఓట్లను ఆకర్షించే సరికొత్త స్ట్రాటజీకి ఈరోజు శ్రీకారం చుట్టాడు..