చంద్రబాబునాయుడుతో భేటీ అయిన రెండు రోజుల్లోనే టిడిపిలోని ముఖ్య నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరుగానీ లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పేరుగాని ప్రస్తావించకుండానే మండిపడ్డారు. మొన్నటి వరకూ చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పవన్ చేసిన ఆరోపణలు, విమర్శలు అందరికీ తెలిసిందే, తన పర్యటనలో అన్నీ చోట్లా చంద్రబాబు అవినీతినే లక్ష్యంగా చేసుకుని పవన్ మాట్లాడుతున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అటువంటి నేపధ్యంలో ప్రజా పోరాటానికి విరామం ఇచ్చిన పవన్ ఈమధ్యే చంద్రబాబుతో ఏకాంతంగా దాదాపు 20 నిముషాలు భేటీ అయ్యారు. దాంతో వారిద్దరి సమావేశంపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో డ్యామేజయిన ఇమేజిని రిపేరు చేసుకునేందుకా అన్నట్లుగా పవన్ అర్జంటుగా మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీపై ఆరోపణలు మొదలుపెట్టారు.
పర్సంటేజీల కోసం రమేషే అడ్డుకున్నారట
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును గతంలో తెలుగుదేశంపార్టీనే అడ్డుకుందా ? జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో కలిసి పవన్ మాట్లాడుతూ, గతంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిందాల్ కంపెనీ ముందుకు వస్తే ఇపుడు ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేస్తున్న వారే అడ్డుకున్నట్లు సిఎం రమేష్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. సిఎం రమేష్ అప్పట్లో ఫ్యాక్టరీని ఎందుకు అడ్డుకున్నారయ్యా ఆంటే పర్సంటేజీల కోసమేనట. అప్పట్లో జిందాల్ ముదుకు వచ్చినపుడు ఫ్యాక్టరీ నిబంధనల్లో తనకు ఉపయోగపడేదేదీ లేదట. అందుకే అప్పట్లో ఫ్యాక్టరీని అడ్డుకున్నారట. దాంతో యాజమన్యం కూడా వెనక్కు తగ్గిందన్నారు.
ముందుకొచ్చిన యాజమాన్యాన్ని వెనక్కు వెళ్ళగొట్టి ఇపుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆందోళనలు చేయటం తెలుగుదేశంపార్టీకి చెల్లిందంటూ పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు పర్సంటేజీలు ఇస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని లేకపోతే రావంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ముఖ్యులు అవలంభిస్తున్న విధానాల వల్లే రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రావటం లేదని పవన్ తేల్చేశారు. ముఖ్యులు అవలంభిస్తున్న విధానాల వల్లే నిరుద్యోగంతో పాటు ప్రాంతీయ విభేదాలు కూడా పెరిగిపోతోందట.